రాయ్పూర్ : ఛత్తీస్గఢ్ జష్పూర్ జిల్లాలో ఆదివారం పిడుగుపాటుకు మైనర్ బాలిక సహా ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. మరో తొమ్మిది మంది గాయపడినట్లు పోలీసులు తెలిపారు. పంద్రాపత్ పోలీసు చౌకీ (అవుట్పోస్ట్) పరిధిలో బుర్జుడిహ్ సాయంత్రం సమయంలో పిడుగుపడినట్లు అధికారులు తెలిపారు. గ్రామంలోని వీక్లీ మార్కెట్లో తినుబండారాల షాపు వద్ద పిడుగుపడినట్లు పేర్కొన్నారు. పిడుగుపాటుకు 12 మంది గాయపడ్డారు.
వారిని ఆసుపత్రికి తరలించగా.. ఇందులో తినుబండారాల దుకాణం యజమాని 12 ఏళ్ల కుమార్తె సహా ముగ్గురు మరణించారని జష్పూర్ అదనపు పోలీసు సూపరింటెండెంట్ ప్రతిభా పాండే పేర్కొన్నారు. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండడంతో అంబికాపూర్ ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా, ఆర్బీసీ (రెవెన్యూ బుక్ సర్క్యులర్) నిబంధనల ప్రకారం మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.4 లక్షల చొప్పున పరిహారం అందించాలని ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ అధికారులను ఆదేశించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని అధికారులకు సూచించారు.