తిరువనంతపురం: కేరళలో జరిగిన బోటు బోల్తా(boat tragedy) ప్రమాదంలో 22 మంది మృతిచెందిన విషయం తెలిసిందే. ఆదివారం రాత్రి ఏడున్నర ప్రాంతంలో తన్నూరు వద్ద బోటు పల్టీకొట్టింది. ఆ ఘటనలో కొందరు ప్రాణాలతో బయపడ్డారు. రజిస అనే మహిళతో పాటు ఆమె భర్త, కూతురు కూడా ప్రాణాలు దక్కించుకున్నారు. అయితే లైఫ్ జాకెట్ ధరించడం వల్లే తాము బ్రతికినట్లు ఆమె చెప్పారు. కానీ ఆ విషాద ఘటన నుంచి ఇంకా కోలుకోవడం లేదన్నారు. బోటుపై చాలా మంది పిల్లలు కూర్చున్నారని, బోటు పడుతున్న సమయంలో టాప్మీద కూర్చున్న వాళ్లు ఒక్కసారిగా నీళ్లలో పడిపోయారని ఆమె చెప్పారు.
ఇబ్రహీం, ఇజాక్ అనే ఇద్దరు సోదరులు కూడా తృటిలో ప్రాణాలు దక్కించుకున్నారు. రష్ బాగా ఉండడంతో ఆ ఇద్దరూ బోటు ఎక్కవద్దు అని డిసైడ్ అయ్యారు. దీంతో వాళ్లు చివరి నిమిషంలో ట్రిప్ను రద్దు చేసుకున్నారు. బోటు కెపాసిటీకి మించి ఆపరేటర్లు జనాన్ని ఎక్కించినట్లు ఆ ఇద్దరు సోదరులు ఆరోపించారు. ప్యాసింజెర్లకు లైఫ్ జాకెట్లు ఇవ్వలేదని వాళ్లు ఆరోపించారు.
అట్లాంటిక్ బోటు బోల్తా కొట్టిన కేసులో దాని ఓనర్ నాసర్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. అయితే అతని సోదరుడు సలామ్, సన్నిహితుడు షఫీని కొచ్చిలో అరెస్టు చేశారు. ఇటీవల చాన్నాళ్లు విదేశాల్లో ఉండి వచ్చిన నాసర్.. ఈమధ్యే మళ్లీ బోటు సర్వీసులు ప్రారంభించాడు. ఓవర్ క్రౌడ్ వల్లనే బోటు మునిగినట్లు చాలా మంది ప్రత్యక్షసాక్షులు చెప్పారు.
బోటు ప్రమాదంపై ప్రభుత్వం న్యాయ విచారణకు ఆదేశించింది. బాధిత కుటుంబాలకు సీఎం విజయన్ పది లక్షల నష్టపరిహారాన్ని ప్రకటించారు.