తొలిసారిగా ఇంజినీర్కు సైన్యం బాధ్యతలు
న్యూఢిల్లీ, ఏప్రిల్ 18: తదుపరి ఆర్మీ చీఫ్గా లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ పాండే నియమితులయ్యారు. ఈ మేరకు రక్షణ మంత్రిత్వశాఖ సోమవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. ఒక ఇంజినీర్కు సైన్యం బాధ్యతలు అప్పగించడం ఇదే తొలిసారి. ప్రస్తుతం ఆర్మీ చీఫ్గా ఉన్న జనరల్ ముకుంద్ నరవణే పదవీ కాలం ఈ నెలాఖరుతో ముగియనున్న నేపథ్యంలో తాజా నియామకం జరిగింది. మనోజ్ పాండే కార్ప్స్ ఆఫ్ ఇంజినీర్స్ విభాగంలో 1982లో చేరారు.
ప్రస్తుతం ఆయన ఆర్మీ వైస్ చీఫ్గా వ్యవహరిస్తున్నారు. అంతకుముందు ఈస్టర్న్ ఆర్మీ కమాండ్కు నేతృత్వం వహించారు. 2001 డిసెంబర్లో పార్లమెంట్పై ఉగ్రదాడి అనంతరం చేపట్టిన ‘ఆపరేషన్ పరాక్రమ్’లో భాగంగా పల్లన్వాలా సెక్టార్ పరిధిలోని ఎల్వోసీ వెంబడి ఇంజినీర్స్ బృందానికి హెడ్గా పనిచేశారు. ఇథియోపియా, ఎరిత్రియా దేశాల్లో యూఎన్ మిషన్కు చీఫ్ ఇంజినీర్గా వ్యవహరించారు.