(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, ఫిబ్రవరి 2 (నమస్తే తెలంగాణ): హిండెన్బర్గ్ పరిశోధనాత్మక కథనం దెబ్బతో అదానీ కంపెనీల షేర్ల పతనం కొనసాగుతుండటం.. మోదీ ప్రభుత్వం అడ్డగోలుగా జాతి సంపదను అదానీకి దోచి పెట్టిందన్న ఆరోపణల నేపథ్యంలో కేంద్రం తన మసకబారిన ప్రతిష్ఠను పునరుద్ధరించుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభించింది. అదానీ కంపెనీల్లో ఎల్ఐసీ పెట్టుబడులు పెట్టినా ఎలాంటి నష్టం జరుగలేదని సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటున్నది. ఎల్ఐసీ సంస్థ అదానీ గ్రూప్లో పెట్టిన పెట్టుబడులు ఎంత? మార్కెట్లో ప్రస్తుతం వాటి విలువ ఎంత? అనే అంశాలతోపాటు ఇంకా ఎల్ఐసీ లాభాల్లోనే ఉన్నదనే వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. స్టాక్ మార్కెట్లో ఎల్ఐసీ పెట్టిన పెట్టుబడుల్లో 1% కూడా అదానీ కంపెనీలో పెట్టలేదని, ఎల్ఐసీకి వచ్చిన నష్టమేమీ లేదని ప్రజలను మభ్యపెట్టడానికి ప్రయత్నిస్తున్నది.