CAG | న్యూఢిల్లీ, నవంబర్ 5: కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా (కాగ్) స్వతంత్రతను కేంద్రంలోని మోదీ సర్కారు దెబ్బతీస్తున్నదని మాజీ ఉన్నతాధికారులు ఆందోళన వ్యక్తంచేశారు. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు బహిరంగ లేఖ రాశారు. దీనిపై 86 మంది విశ్రాంత ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులు సంతకం చేశారు. కాగ్ స్థాపిత ఉద్దేశాలు, దాని స్వతంత్రత దెబ్బతినకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్రపతిని అభ్యర్థించారు. కాగ్ కార్యకలాపాలు పడిపోతున్నాయని.. కేంద్ర ప్రభుత్వ శాఖలు, విభాగాలపై కాగ్ వెలువరించిన నివేదికలే ఇందుకు ఉదాహరణ అని వారు పేర్కొన్నారు. 2015లో కాగ్ 55 నివేదికలు వెలువరించగా.. 2020 నాటికి అది 75 శాతం పడిపోయి 14కు చేరిందన్నారు. గతంలో పనిచేసినంత వేగంగా కాగ్ ఇప్పుడు పని చేయడం లేదని.. కేంద్ర ప్రభుత్వ పనితీరుపై పార్లమెంటుకు సమర్పించే ఆడిట్ నివేదికల సంఖ్యలో తగ్గుదల ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు.
ఈ ఏడాది సెప్టెంబర్లో పార్లమెంట్కు సమర్పించిన కాగ్ నివేదికలు అవినీతిని బయట పెట్టాయని.. దీంతో ఈ ఆడిట్కు బాధ్యులైన అధికారులను కేంద్రం బదిలీ చేసిందని ఆరోపించారు. ఎన్హెచ్ఏఐ, ఆయుష్మాన్ భారత్ ప్రాజెక్టుల్లో ప్రభుత్వం, ప్రభుత్వ విభాగాలు తప్పుడు లేదా అధిక వ్యయం చేసిన ఉదంతాలను గణాంకాలతో సహా నివేదికలు బయటపెట్టాయని.. అందుకే ఆ అధికారులను బదిలీ చేశారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ విభాగాల ఆడిటింగ్కు అత్యంత కీలకమైన ఫీల్డ్ వర్క్ను నిలిపివేయాలని కాగ్ అధికారులు ఆదేశాలివ్వడాన్ని వారు ప్రస్తావించారు. ‘కాగ్ రిపోర్ట్ మీడియా దృష్టికి వచ్చిన తర్వాత క్షేత్రస్థాయి ఆడిట్ నిలిపేయడం తీవ్రమైన అంశం. ఫీల్డ్ ఆడిట్ వర్క్ను నిలిపేయడంమంటే కాగ్ పనిచేయడం లేదన్న మాటే. ఇది తీవ్రమైన రాజ్యాంగ ఉల్లంఘనే’ అని మాజీ ఉన్నతాధికారులు ఆందోళన వ్యక్తం చేశారు.
కాగ్ నివేదికల్లో తగ్గుదల ఇలా..
ఏడాది – నివేదికలు
2015 – 54
2016 – 43
2017 – 50
2018 – 19
2019 – 18
2020 – 17
2021 – 28
2022 – 30
2023 – 16