Rabri Devi : బీహార్ (Bihar) లో ప్రభుత్వ బంగ్లా వివాదం మరోసారి తీవ్రరూపం దాల్చింది. మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ నేత (RJD leader) రబ్రీదేవి (Rabri Devi) ఉంటున్న అధికారిక నివాసాన్ని ఖాళీ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీచేయగా.. ఆమె అందుకు ససేమిరా అంటున్నారు. దమ్ముంటే తనను బలవంతంగా ఖాళీ చేయించాలని ప్రభుత్వానికి ఆమె సవాల్ విసిరారు. ఈ పరిణామంతో ఎన్డీఏ ప్రభుత్వానికి, ఆర్జేడీకి మధ్య మాటల యుద్ధం ముదిరింది.
పట్నాలోని 10 సర్క్యులర్ రోడ్ బంగ్లాలో రబ్రీదేవి దశాబ్దానికిపైగా నివసిస్తున్నారు. అయితే ఈ నెల 27న భవన నిర్మాణ శాఖ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం ఈ బంగ్లాను పాడి, మత్స్యశాఖ మంత్రి నంద్ కిశోర్ రామ్కు కేటాయించారు. ఈ ఉత్తర్వులు వచ్చినప్పుడు సెలవుపై ఉన్న రబ్రీదేవి, తిరిగి పట్నా విమానాశ్రయానికి చేరుకోగానే ఈ విషయంపై మీడియా ప్రశ్నించింది. దాంతో ఆమె తీవ్రంగా స్పందించారు. ‘సామ్రాట్ చౌదరి ముఖ్యమంత్రి అయినందుకు చాలా ఉత్సాహంగా ఉన్నట్టున్నారు. దమ్ముంటే వాళ్ల ప్రభుత్వమే నన్ను బలవంతంగా ఖాళీ చేయించాలి. నేను మాత్రం ఇల్లు ఖాళీ చేయను’ అని స్పష్టంచేశారు.
గతంలో నితీశ్ కుమార్ నేతృత్వంలోని ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఆమెకు ఈ బంగ్లాను కేటాయించింది. అయితే ఇప్పుడు ఖాళీ చేయాలని కోరడం రాజకీయ కక్ష సాధింపేనని ఆర్జేడీ ఆరోపిస్తోంది. ఈ వివాదంపై భవన నిర్మాణ శాఖ మంత్రి లేషి సింగ్ స్పందిస్తూ.. శాసనమండలి ప్రతిపక్ష నేతగా రబ్రీదేవికి 39, హార్డింగ్ రోడ్ బంగ్లాను ఇదివరకే కేటాయించామని, ఆమె అక్కడికి మారితే మంచిదని సూచించారు. ప్రభుత్వ బంగ్లాలను ఎవరికి కేటాయించాలనేది ప్రభుత్వ విశేషాధికారమని, ఎవరూ ఒకే బంగ్లాపై హక్కును క్లెయిమ్ చేయలేరని ఆమె స్పష్టంచేశారు.
నిజానికి గత ఏడాది నవంబర్లోనే ఈ బంగ్లాను ఖాళీ చేయాలని ప్రభుత్వం రబ్రీదేవిని కోరింది. అప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్న విజయ్ కుమార్ సిన్హాకు బంగ్లాను కేటాయించింది. కానీ రబ్రీదేవి ఖాళీ చేయకపోవడంతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది. కాగా, రబ్రీదేవితోపాటు ఆమె భర్త లాలూ ప్రసాద్ యాదవ్, కుమారుడు, అసెంబ్లీలో ప్రతిపక్ష నేత తేజస్వి యాదవ్ కూడా ఎక్కువ సమయం ఆ నివాసంలోనే గడుపుతుంటారు. దాంతో ఆ నివాసం ఆర్జేడీకి అనధికారిక కార్యాలయంగా మారింది.
తాజాగా మళ్లీ బంగ్లాను ఖాళీ చేయాలని ప్రభుత్వం ఆదేశించడం, రబ్రీదేవి అందుకు ససేమిరా అంటుండటంతో ఆ బంగ్లా వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రభుత్వం భారీగా పోలీసులను మోహరించింది. శనివారం మధ్యాహ్నం ఓ డీఎస్పీ స్థాయి అధికారిణి రబ్రీదేవితో మాట్లాడేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఈ చర్యలను ఆర్జేడీ తీవ్రంగా ఖండించింది. ప్రతిపక్ష నేతలపై ఎన్డీఏ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ఆర్జేడీ అధికార ప్రతినిధి చిత్తరంజన్ గగన్ మండిపడ్డారు.