న్యూఢిల్లీ: ఎన్నికల వ్యూహాకర్త ప్రశాంత్ కిశోర్ ఇవాళ సంచలన కామెంట్స్ చేశారు. తన ట్విట్టర్లో ఆయన కాంగ్రెస్ పార్టీ వైఖరిని ప్రశ్నించారు. ఏకంగా రాహుల్ గాంధీనే ఆయన టార్గెట్ చేశారు. గడిచిన పదేళ్లలో కాంగ్రెస్ పార్టీ 90 శాతం ఎన్నికల్లో ఓటమి పాలైందని, ఇక ఆ పార్టీ నాయకత్వం ఓ వ్యక్తికే చెందిన దైవ హక్కుగా భావిస్తున్నట్లు ప్రశాంత్ కిషోర్ విమర్శించారు. కొన్ని నెలల క్రితం రాహుల్ గాంధీతో చర్చలు నిర్వహించిన ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు తన రూటు మార్చినట్లు తెలుస్తోంది. ముంబైలో బుధవారం బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలతో దేశ రాజకీయాల్లో కొత్త మార్పు కలుగుతున్నట్లు స్పష్టమవుతోంది. ప్రతిపక్షం ఎప్పుడూ బలంగా ఉండాలని.. ఇక విపక్ష సారధిని ప్రజాస్వామ్య రీతిలో ఎన్నుకోవాలని ప్రశాంత్ కిషోర్ తన ట్వీట్లో అభిప్రాయపడ్డారు. మమతా బెనర్జీ కూడా రాహుల్ గాంధీ తీరును తీవ్రంగా తప్పుపట్టారు. ఓ వ్యక్తి ఏమీ చేయకుండా.. ఎప్పుడూ విదేశాల్లో గడుపుతుంటే, ఇక ఇక్కడి రాజకీయాలు ఎవరు చేస్తారని ఆమె ప్రశ్నించారు. రాజకీయాల్లో ఉన్నవాళ్లు నిరంతరం ప్రయత్నిస్తూనే ఉండాలని బెంగాల్ సీఎం అన్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ దీదీకి సపోర్ట్గా ప్రశాంత్ కిషోర్ ట్వీట్ చేసినట్లు అర్థమవుతోంది.