Wrestlers Protest | హైదరాబాద్, జూన్ 5 (నమస్తే తెలంగాణ), న్యూఢిల్లీ: రెజ్లర్ల ఉద్యమం నీరుగారుతున్నదా? కుస్తీవీరులు కేంద్రం ఉచ్చులో పడ్డారా? ఇప్పుడు ఈ వీరుల మెడలను వంచడానికి కేంద్రం కుట్రపన్నిందా? అంటే ఆ అనుమానమే కలుగుతుతన్నది. లైంగిక వేధింపులకు పాల్పడిన రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్పై చర్యలు తీసుకునే వరకూ వెనకడుగు వేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పిన రెజ్లర్లు.. ఇప్పుడు ఉద్యమం కొనసాగుతుందని, కాకపోతే ఉద్యోగాలు చేసుకుంటూ ఉద్యమిస్తామని చెప్పడం పలు అనుమానాలకు తావిస్తున్నది. శనివారం కేంద్ర హోంమంత్రి అమిత్ షాను రెజ్లర్లు కలిశారని, ఆయన వేసిన ఉచ్చులో రెజ్లర్లు చిక్కుకున్నారని, అందుకే రెజ్లర్ల మాటల్లో నాటి గంభీరం తగ్గిందని పలువురు పేర్కొంటున్నారు. నాడు రైతు ఉద్యమాన్ని నీరుగార్చడానికి కేంద్రం ఎలాంటి కుట్రకు తెరలేపిందో ఇప్పుడు రెజ్లర్ల ఉద్యమాన్ని అణగదొక్కడానికి అలాంటి కుట్రకే పాల్పడుతున్నదని చెప్తున్నారు.
రెండేండ్ల క్రితం ఢిల్లీ సరిహద్దులో సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఉద్ధృతంగా కొనసాగుతున్న రైతు ఉద్యమం ఒక దశలో క్రమంగా చల్లబడుతున్న వాతావరణం కనిపించింది. దీనికి ఒక రైతు సంఘం నేత చెప్పిన కారణం ఏంటంటే మాకు వ్యవసాయం కూడా ముఖ్యమే. అందుకే రైతులు ఇక నుంచి రొటేషన్ పద్ధతిలో ఆందోళన కొనసాగిస్తారు. ఒక బ్యాచ్ గ్రామాలకు వెళితే, మరొక బ్యాచ్ ఆందోళన కొనసాగించేలా కార్యక్రమాన్ని రూపొందించినట్టు చెప్పారు. సరిగ్గా రెజ్లర్ల ఆందోళనలో కూడా ఇదే రకమైన మాటలు తాజాగా వినిపిస్తున్నాయి. రైల్వేలో మా ఉద్యోగాలను నిర్వర్తిస్తూనే ఆందోళనను కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నట్టు రెజ్లర్లు సాక్షి మాలిక్, బజరంగ్ పూనియా ప్రకటించారు.
తదుపరి కార్యాచరణపై అస్పష్టత
బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ను అరెస్టు చేసేంత వరకు తమ ఉద్యమం కొనసాగుతుందని రెజ్లర్లు స్పష్టం చేశారు. ఆందోళనలను విరమించామని వస్తున్న వార్తలను రెజ్లర్లు సోమవారం ఖండించారు. ఈ మేరకు ప్రముఖ రెజ్లర్లు బజరంగ్ పూనియా, సాక్షిమాలిక్ అవాస్తవాలను నమ్మవద్దంటూ ప్రజలను కోరారు. తాము ఆందోళనలను కొనసాగిస్తామని చెప్పారు. తమకు న్యాయం జరిగేంత వరకు మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధించిన బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్కు వ్యతిరేకంగా చేస్తున్న పోరాటం ఆగదని వారు తేల్చి చెప్పారు. ఈ మేరకు వారు ట్వీట్ చేశారు.
ఉద్యమం ఆగదు…
‘ఈ వార్త పూర్తిగా అవాస్తవం. న్యాయం కోసం జరుగుతున్న పోరాటం నుంచి మాలో ఎవ్వరూ తప్పుకోలేదు. సత్యాగ్రహం ఉద్యమంతో పాటు రైల్వేల్లో నా విధులను నిర్వర్తించాను. న్యాయం జరిగేంత వరకు మా పోరాటం కొనసాగుతుంది. దయచేసి ఎవరూ అవాస్తవాలను వ్యాప్తి చేయవద్దు’ అని సాక్షిమాలిక్ ట్వీట్ చేశారు. ఓ న్యూస్ చానల్లో వస్తున్న వార్తల స్క్రీన్షాట్ను ఆమె ట్వీట్కు జత చేశారు.
ఆందోళనలు విరమించామన్నది వదంతే…
‘తాము ఆందోళనలను విరమించామన్న వార్త పూర్తిగా వదంతు. మనకు హాని తలపెట్టేందుకే ఈ అబద్ధపు వార్తలను ప్రచారం చేస్తున్నారు. మేం వెనక్కి తగ్గలేదు. ఉద్యమాన్ని విరమించలేదు. న్యాయం దక్కేంత వరకు తమ పోరాటం ఆగదు’ అని బజరంగ్ పూనియా ట్వీట్ చేశారు.
అమిత్ షాతో భేటీ తర్వాత…
మే 28న జంతర్మంతర్ వద్ద ఉన్న రెజ్లర్ల నిరసన శిబిరాలను పోలీసులు తొలగించారు. రెజ్లర్లను బలవంతంగా అక్కడి నుంచి ఖాళీ చేయించారు. మొదట రెజ్లర్లను పోలీసులు అదుపులోకి తీసుకొని అనంతరం వదిలేశారు. జంతర్మంతర్ వద్ద రెజ్లర్ల నిరసనలకు అనుమతి ఇవ్వబోమని పోలీసులు తెగేసి చెప్పారు. దీంతో తమ పతకాలను గంగలో నిమజ్జనం చేస్తామంటూ మే 31న రెజ్లర్లు ఆందోళనలను తీవ్రతరం చేశారు. భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) అధ్యక్షుడు నరేష్ టికాయత్ జోక్యంతో వారు వెనక్కితగ్గారు. అనంతరం రెజ్లర్లు శనివారం రాత్రి కేంద్ర మంత్రి అమిత్ షాతో భేటీ అయినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ భేటీ తర్వాత రెజ్లర్లు తమ తదుపరి కార్యాచరణ ఏంటన్నది ఇప్పటికీ తెలియజేయలేదు. ఎక్కడ ఆందోళనలు చేస్తారనేది చెప్పలేదు. అదే సమయంలో ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న రెజ్లర్లు విధుల్లో చేరారు. తమతమ ఉద్యోగ బాధ్యతల్లో తలమునకలయ్యారు. ఆందోళనలను ఎలా కొనసాగించాలనే అంశంపై ఇప్పటికీ రెజ్లర్లు స్పష్టత ఇవ్వడం లేదు. దీంతో రెజ్లర్లు ఆందోళనలను విరమించారనే వార్తలు వ్యాపిస్తున్నాయి. దీనికితోడు రెజ్లర్లు బజరంగ్పూనియా, సాక్షిమాలిక్, వినేశ్ ఫొగట్ రైల్వేలో వారివారి విధుల్లో చేరిపోయారు. బరోడా హౌస్ ఆఫీస్లో విధుల్లో చేరిన సాక్షిమాలిక్ రైల్వే ఇంటర్ డివిజనల్ ఛాంపియన్షిప్స్ నిర్వహించేందుకు అంగీకారం తెలుపుతూ ఓఎస్డీ హోదాలో సంతకం చేసిన లేఖ సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నది. దీంతో ఆందోళనలు విరమించారన్న వార్తలు మరింతగా వ్యాప్తిస్తున్నాయి.