జైపూర్: అటవీ ప్రాంతం సమీపంలోని గ్రామాల్లో సంచరిస్తున్న చిరుత ముగ్గురు వ్యక్తులపై దాడి చేసి చంపి తిన్నది. (Leopard Attack) దీంతో అది నరమాంస భక్షకిగా మారిందని గ్రామస్తులు ఆందోళనకు దిగారు. హైవేను దిగ్బంధించి నిరసన వ్యక్తం చేశారు. రాజస్థాన్లోని ఉదయ్పూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. బుధవారం ఉండితాల్ గ్రామానికి చెందిన 16 ఏళ్ల కమల మేకలు మేపేందుకు అటవీ ప్రాంతానికి వెళ్లింది. ఆ బాలిక ఇంటికి తిరిగి రాకపోవడంతో గ్రామస్తులు వెతికారు. చిధ్రమైన ఆమె మృతదేహం మరుసటి రోజు అడవిలో కనిపించింది. అలాగే పొరుగున ఉన్న భెడియా నుంచి గ్రామానికి తిరిగి వస్తున్న ఖేమారామ్, అతడి కొడుకుపై చిరుత దాడి చేసింది. బాలుడు పరుగెత్తి పారిపోగా ఆ చిరుత ఖేమారామ్ను చంపి తిన్నది.
కాగా, ఛాలి గ్రామానికి చెందిన 50 ఏళ్ల మహిళను కూడా చిరుత పులి చంపింది. సెప్టెంబరు 8న ఝడోల్ సమీపంలో ఒక మహిళపై అది దాడి చేసింది. ఈ నేపథ్యంలో ఆ చిరుత నరమాంస భక్షకిగా మారిందని గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. శుక్రవారం ఝడోల్, గోగుండ మధ్య రాష్ట్ర రహదారిని దిగ్భందించి నిరసన వ్యక్తం చేశారు.
మరోవైపు మనుషులపై దాడి చేసి చంపుతున్న ఆ చిరుతను బంధించేందుకు అటవీ శాఖ అధికారులు ప్రయత్నిస్తున్నారు. రెండు బృందాలను ఆయా గ్రామాలకు పంపారు. పలు చోట్ల పులి బోనులు ఏర్పాటు చేశారు. అయితే ఆ చిరుత నరమాంస భక్షకిగా మారిందా అన్నది ఇప్పుడే చెప్పలేమని అటవీ శాఖ అధికారి అన్నారు.