న్యూఢిల్లీ: దేశంలో వామపక్ష తీవ్రవాద హింస తగ్గుతోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ తెలిపారు. వామపక్ష తీవ్రవాద హింసపై వేసిన ప్రశ్నకు ఆయన రాజ్యసభలో బదులు ఇచ్చారు. అంతర్జాతీయ గ్రూపుల ప్రేరణతో ఇండియాలో మావోయిస్టు ఐడియాలజీ విస్తరిస్తున్నట్లు ఆయన చెప్పారు. వామపక్ష తీవ్రవాదులపై ఏదైనా చర్య తీసుకుంటే, అప్పుడు ఏదో ఒక అంతర్జాతీయ గ్రూపు వారికి హెల్ప్ చేసేందుకు ముందుకు వస్తోందన్నారు. వామపక్ష తీవ్రవాదం చాలా ప్రమాదకర ఐడియాలజీ అన్నారు. ఇండియాకు వ్యతిరేకంగా నినాదాలు చేసేవాళ్లు ఎన్నటికీ భారతీయ సంస్కృతిలో భాగం కాలేరన్నారు. పేదల పట్ల ప్రధాని మోదీ దేవుడని, అర్బన్ నక్సల్ ఐడియాలజీని అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. తీవ్రవాదాన్ని పరిష్కరించేందుకు 2015లో తమ ప్రభుత్వం కొత్త జాతీయ విధానాన్ని అమలు చేసిందని, దాని ద్వారా హింస తగ్గినట్లు మంత్రి నిత్యానంద రాయ్ తెలిపారు. లెఫ్ట్ వింగ్ వాయిలెన్స్ 77 శాతం తగ్గినట్లు ఆయన చెప్పారు. 2009లో 2258 హింసాత్మక కేసులు నమోదు కాగా, 2021లో ఆ కేసుల సంఖ్య 509కి చేరుకుందని మంత్రి తెలిపారు. వామపక్ష తీవ్రవాదం విస్తరిస్తున్న తీరు కూడా కుంచించుకుపోయిందని, ఇప్పుడు కేవలం 46 జిల్లాల్లో దాని ప్రభావం ఉన్నట్లు ఆయన చెప్పారు. 2010లో లెఫ్ట్ వింగ్ తీవ్రవాదం 96 జిల్లాల్లో ఉండేదన్నారు.