Filmmaker Dies | దేశ రాజధాని ఢిల్లీ (Delhi) లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదంలో యువ ఫిల్మ్మేకర్ ప్రాణాలు కోల్పోయాడు (Filmmaker Dies). ఈ ఘటన సౌత్ ఢిల్లీలో గత నెల 28వ తేదీన రాత్రి చోటు చేసుకున్నట్లు పోలీసులు గురువారం వెల్లడించారు.
పియూష్ పాల్ (30) (Piyush Pal) అనే వ్యక్తి గురుగ్రామ్లో ఫ్రీలాన్స్ ఫిల్మ్మేకర్గా పనిచేస్తున్నాడు. సౌత్ ఢిల్లీలోని కల్కాజీ ప్రాంతంలో నివాసం ఉండే పియూష్.. రోజూ తన బైక్పై విధులకు వెళ్లి వస్తుంటాడు. అయితే గతనెల 28వ తేదీన రాత్రి 10 గంటల సమయంలో విధులు ముగించుకుని బైక్పై ఇంటికి బయలుదేరాడు. పంచశీల్ ఎన్క్లేవ్ (Panchsheel Enclave) సమీపంలోకి రాగానే పియూష్ ప్రయాణిస్తున్న బైక్ను మరో ద్విచక్రవాహనం బలంగా ఢీ కొట్టింది. దీంతో అతడు కిందపడిపోయి.. అలాగే కొన్ని మీటర్ల వరకూ బైక్తోపాటు రోడ్డుపై ఈడ్చుకుంటూ వెళ్లి రోడ్డుపక్కన పడిపోతాడు. గమనించిన స్థానికులు అక్కడికి చేరుకొని రక్తపు మడుగుల్లో పడి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న పియూష్ను చూస్తూ ఉన్నారే తప్ప ఎవరూ సాయం చేసేందుకు ముందుకు రాలేదు. పైగా ఈ ఘటనను ఫొటోలూ, వీడియోలూ తీస్తూ ఉన్నారు.
ఇంతలో సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని చావుబతుకుల్లో ఉన్న ఫిల్మ్మేకర్ను సమీపంలోని ఆసుపత్రికి తరలిస్తారు. అయితే, ప్రమాదంలో తీవ్ర గాయాలు కావడంతో అతడు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. ఘటనపై పియూష్ స్నేహితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఓ మనిషి ప్రాణాలతో పోరాడుతుంటే ఎవరూ సాయం చేయలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదం తర్వాత పియూష్ ఫోన్, కెమెరాను ఎవరో దొంగలించినట్లు ఆరోపించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని బంటిగా గుర్తించారు.
Also Read..
Nita Ambani | పుట్టినరోజు సందర్భంగా జూనియర్ స్కూల్ను ప్రారంభించిన నీతా అంబానీ
Karwa Chauth | కర్వాచౌత్ వేడుకల్లో మెరిసిన తారలు.. ఫొటోలు వైరల్
Ram Charan | ఆస్కార్ యాక్టర్స్ బ్రాంచ్ లోకి చేరిన రామ్చరణ్.. ప్రకటించిన అకాడమీ