అన్నాడీఎంకేలో నాయకత్వ పోరు
జనరల్ కౌన్సిల్ మీటింగ్లో గొడవ
పార్టీ చీఫ్ పన్నీర్సెల్వం పైకి బాటిళ్లు
పళనిస్వామికి సీనియర్ల మద్దతు
చెన్నై, జూన్ 23: అన్నాడీఎంకేలో నాయకత్వ పోరు ముదిరి పాకాన పడింది. పార్టీ అధ్యక్ష స్థానం కోసం ప్రస్తుత చీఫ్ ఓ పన్నీర్ సెల్వం(ఓపీఎస్), సంయుక్త సమన్వయాధికారి ఎడప్పాడి పళనిస్వామి(ఈపీఎస్) మధ్య యుద్ధం తారస్థాయికి చేరింది. ఫలితంగా అన్నాడీఎంకే జనరల్ కౌన్సిల్ సమావేశం గురువారం రసాభాసగా ముగిసింది. కౌన్సిల్ సమావేశం మధ్యలో నుంచి వెళ్లిపోతుండగా పన్నీర్ సెల్వంపై పళనిస్వామి మద్దతుదారులు నీళ్ల బాటిళ్లు విసిరారు.
జనరల్ కౌన్సిల్ సమావేశం ప్రారంభం కావడమే విచిత్రంగా జరిగింది. పన్నీర్ సెల్వం, పళనిస్వామి ఎవరి మద్దతుదారులతో వాళ్లు సమావేశ హాల్కు వచ్చారు. ఇరు వర్గాల నేతలు పరస్పరం వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అంతకుముందే నిర్ణయించిన 23 తీర్మానాలను సమావేశం ముందు పెట్టగా అన్నీ తిరస్కరణకు గురయ్యాయి. ‘పార్టీకి ఒక్కరే నాయకుడు ఉండాలి’ అని పళనిస్వామి వర్గం భీష్మించింది. దీన్ని పన్నీర్ సెల్వం వ్యతిరేకిస్తున్నారు. ఎడప్పాడికి సీనియర్ల మద్దతు ఉంది. దీంతో పన్నీర్ సెల్వం సమావేశం మధ్యలో నుంచే వెళ్లిపోయారు. సమావేశం 40 నిమిషాల పాటు సాగగా.. ఆద్యంతం హైడ్రామా కొనసాగింది. కాగా, పార్టీ నాయకత్వంపై వచ్చే నెల 11న మళ్లీ సమావేశం కావాలని నిర్ణయించారు.