Om Birla | నినాదాలు చేయడం ద్వారా నేతలు తయారుకారని, కేవలం చర్చల ద్వారా మాత్రమే సాధ్యమని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అభిప్రాయపడ్డారు. గుజరాత్ శాసనసభ సభ్యుల రెండురోజుల ఓరింయంటేషన్ కార్యక్రమాన్ని బుధవారం ఓం బిర్లా ప్రారంభించారు. పార్లమెంట్, పలు రాష్ట్రాల అసెంబ్లీలో ఇటీవల జరిగిన గందరగోళం జరుగడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్లమెంట్, రాష్ట్రాల అసెంబ్లీల్లో జరుగుతున్న ఆరోపణలు, ప్రత్యారోపణల ‘కొత్త సంప్రదాయం’ దేశ ప్రజాస్వామ్యానికి సరికాదన్నారు. ప్రజాస్వామ్యాన్ని చైతన్యవంతం చేసేందుకు సభల్లో నిర్మాణాత్మక చర్చలు జరుగాలన్నారు. ప్రజాస్వామ్యంలో విమర్శ అనేది ‘శుద్ధి యాగం’లాంటిదన్న ఆయన.. అవసరమైన చోట ప్రతిపక్షాలు ప్రభుత్వ విధానాలను విమర్శించడంతో పాటు నిర్మాణాత్మక సూచనలు ఇవ్వాలని సూచించారు. దీనికి బదులుగా ఆరోపణలు, ప్రత్యారోపణల కొత్త సంప్రదాయం కనిపిస్తుందన్నారు. రాజ్యాంగబద్ధమైన ప్రజాస్వామ్యంలో గవర్నర్, రాష్ట్రపతి ప్రసంగానికి అంతరాయం కలిగించడం మంచి పద్ధతి కాదన్నారు.
గర్నవర్, రాష్ట్రపతి రాజ్యాంగపరంగా ఉన్నతమైన వ్యక్తులని, ఏ పార్టీ అధికారంలో ఉన్నా మనం సంప్రదాయం పాటించాలన్నారు. ప్రజాస్వామ్యం సజీవంగా ఉండాలంటే చర్చలు జరుగాలని, చట్టాల రూపకల్పనలో పాల్గొనాలన్నారు. చట్టాలను రూపొందించే సమయంలో నిపుణుల నుంచి విభిన్న సలహాలు సూచనలు తీసుకోవాలన్నారు. కొత్తగా ఎన్నికైన శాసనసభ్యులు చర్చలపై అధ్యయనం చేసి, దాని నుంచి జ్ఞానాన్ని పెంపొందించుకోవాలన్నారు.