Supreme Court | న్యాయవాదులు కేవలం ప్రచారం కోసం పత్రికల్లో వచ్చిన వార్తల ఆధారంగా సంక్లిష్ట సమస్యలపై పిటిషన్లు వేయొద్దని దేశ సర్వోన్నత న్యాయస్థానం సూచించింది. రైతుల ఆందోళన, డిమాండ్లపై దాఖలైన పిటిషన్లను ఉపసంహరించుకునేందుకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. ఈ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది. శాంతియుతంగా ధర్నా చేయడం రైతుల హక్కని, హక్కులను ఉల్లంఘించకుండా చూడాలని పిటిషన్లో కోరారు. రైతుల పట్ల ప్రభుత్వం న్యాయంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు.
రైతులు ఢిల్లీకి వెళ్లి నిరసన తెలుపాలనుకుంటే.. వారిని అడ్డుకోకూడదన్నారు. రైతులను అడ్డుకునేందుకు పోలీసు యంత్రాంగం సృష్టించిన అడ్డంకులను తొలగించాలని పిటిషన్లో కోరారు. రైతులపై పోలీసుల బలగాలను ప్రయోగించిన తీరుపై విచారణ జరిపి.. గాయపడిన, మరణించిన కుటుంబాలకు పరిహారం అందించాలని పిటిషన్లో కోరారు. అయితే, ఈ పిటిషన్ను విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది.
ఈ పిటిషన్ను సవరించాలన్న పిటిషనర్ అభ్యర్థనను పరిగణనలోకి తీసుకుని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ కేవీ విశ్వనాథన్లతో కూడిన ధర్మాసనం కేసు ఉపసంహరణకు అనుమతించింది. జస్టిస్ సూర్యకాంత్ పిటిషన్ దాఖలు చేసిన విధానంపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. వార్తల ఆధారంగా పిటిషన్ వేయొద్దని.. సొంతంగా సమస్యలపై హోంవర్క్ చేయాలని సూచించింది. చాలా తీవ్రమైన సమస్య అని.. నిజంగా నిబద్ధత, నిజాయితీ, సీరియస్గా ఉన్న వ్యక్తి మాత్రమే పిటిషన్ వేయాలని.. అందరూ కాదన్నారు. కేవలం పబ్లిసిటీ ప్రయోజనం కోసం ఇలాంటి కేసులను చేయొద్దని వ్యాఖ్యానించారు.