అహ్మదాబాద్ : బిల్కిస్ బానో లైంగిక దాడి కేసులో 11 మంది దోషులను క్షమాభిక్ష కింద గుజరాత్ ప్రభుత్వం విడుదల చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దోషుల విడుదలను బిల్కిస్ బానో న్యాయవాది శోభా గుప్తా ఆక్షేపించారు. ఈ ఘటన అనంతరం హత్యాచార కేసులో ప్రతి దోషి తమకు ఉపశమనం కలిగించాలని దరఖాస్తు చేస్తాడని ఆందోళన వ్యక్తం చేశారు. దోషులు పాల్పడిన తీవ్ర నేరంపై దృష్టి సారించకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా అనిపిస్తోందని రేపిస్టుల విడుదలపై ఆమె వ్యాఖ్యానించారు.
ఈ కేసులో క్షమాభిక్ష ప్రసాదిస్తే ఇక ప్రతి ఒక్క లైంగిక దాడి కేసులో దోషి క్షమాభిక్ష ఎందుకు కోరడని శోభా గుప్తా ప్రశ్నించారు. చట్టంలో దోషులకు ఉపశమనం సరైంది కాదని, ఇది హక్కులకు సంబంధించినది ఎంతమాత్రం కాదని ఆమె పేర్కొన్నారు. కాగా, బిల్కిస్ బానోపై సామూహిక లైంగిక దాడి, ఆమె కుటుంబ సభ్యులు ఏడుగురిని హత్య చేసిన కేసులో ముంబై సీబీఐ ప్రత్యేక న్యాయస్ధానం పదకొందు మంది నిందితులకు జీవిత ఖైదు విధించింది.
వీరికి విధించిన శిక్షను ఆపై బాంబే హైకోర్టు సమర్ధించింది. వీరంతా 15 ఏండ్లు పైగా జైలు శిక్ష అనుభవించగా ఖైదీల్లో ఒకరు తమను ముందస్తుగా విడుదల చేయాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ అంశాన్ని పరిశీలించాలని సర్వోన్నత న్యాయస్ధానం గుజరాత్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. కోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేసింది.