Manipur | అల్లర్లతో అట్టుడుకుతున్న మణిపూర్లో పరిస్థితిపై కేంద్ర మంత్రి రాజ్కుమార్ రంజన్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మణిపూర్లో శాంతిభద్రతలు పూర్తిగా దిగజారాయని పేర్కొన్నారు. గురువారం రాత్రి కొందరు ఆగంతకులు ఇంఫాల్లోని కొంగ్బా ప్రాంతంలోని రాజ్కుమార్ రంజన్ సింగ్ ఇంటిని దగ్ధం చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం విదేశాంగశాఖ సహాయ మంత్రిగా ఉన్నారు. తాను ఎంతో ప్రేమతో ఇల్లు కట్టుకున్నానని, కానీ, తనను ఎందుకు లక్ష్యంగా చేసుకున్నారో అర్థం చేసుకోలేకపోతున్నానని అన్నారు.
`కొందరు నా ఇంటిని ధ్వంసం చేయడానికి ప్రయత్నించారు. కూల్చేశారు. ఈ సంగతి తెలిసి నేను దిగ్భ్రాంతికి గురయ్యాను. నా రాష్ట్రంలో సహచర పౌరులు ఇటువంటి పని, కార్యక్రమాలు చేస్తారని నేనెప్పుడూ అంగీకరించలేదు. ఇటువంటి ఘటన జరుగవద్దని నేను దేవుడిని ప్రార్థించాను. తొలిసారి దాడి చేసినప్పుడు భద్రతా సిబ్బంది రక్షించారు. కానీ రెండోసారి గురువారం రాత్రి 10.30 గంటల సమయంలో అంతా సాధారణంగా ఉందనుకున్న సమయంలో అకస్మాత్తుగా ప్రజలు గుంపులు గుంపులుగా వచ్చి దాడి చేశారు అని నాకు చెప్పారు` అని రాజ్కుమార్ రంజన్ సింగ్ తెలిపారు.
దాడి జరిగిన సమయంలో మంత్రి రాజ్కుమార్ రంజన్ సింగ్.. కేరళ పర్యటనలో ఉన్నారు. ఈ ప్రాంతాన్ని ప్రజలు చుట్టుముట్టారు. దీంతో మంటలను ఆర్పేందుకు వచ్చిన ఫైరింజన్లు ఆ ఇంటి వద్దకు వెళ్లలేకపోయాయి. `వారు నా ఇంటిపై ఎందుకు దాడి చేశారో నాకు తెలియదు. అందుకు సహేతుకమైన కారణమే లేదు. నేను రాష్ట్రంలో సాధారణ శాంతియుత వాతావరణం నెలకొల్పేందుకు నా సీనియర్ మంత్రులు, సహచరులతో సంప్రదింపులు జరుపుతున్నా, శాంతి నెలకొల్పేందుకు ప్రయత్నించా. అయినా ఈ అవాంఛనీయ ఘటన జరిగింది. ఒకవేళ నా కొడుకులు, కూతుళ్లు, కుటుంబం అక్కడే ఉండి ఉంటే, పెట్రోల్ పోసి తగలబెట్టే వారు. నా పైనా దాడి చేసే అవకాశం ఉన్నట్లు కనిపిస్తున్నది` అని ఏఎన్ఐ వార్తా సంస్థతో చెప్పారు.
`కేంద్రం పలు రక్షణలు కల్పించినా, రాపిడ్ యాక్షన్ ఫోర్స్ (ఆర్ఏఎఫ్) బలగాలు ఉన్నా, రాష్ట్ర ప్రభుత్వం శాంతిని కాపాడలేకపోయింది. మణిపూర్లో శాంతిభద్రతలు పూర్తిగా అదుపు తప్పాయి. వ్యవస్థ ఎందుకు ఫెయిల్ అయిందో నాకు తెలియదు` అని రాజ్ కుమార్ రంజన్ సింగ్ తెలిపారు.