గుర్దాస్పూర్: ఆమ్ఆద్మీ పార్టీ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అప్పుడే లోక్సభ ఎన్నికల ప్రచారం మొదలుపెట్టారు. శనివారం పంజాబ్ రాష్ట్రంలోని గుర్దాస్పూర్ లోక్సభ నియోజకవర్గంలో ఆప్ శ్రేణులు ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేజ్రీవాల్ పాల్గొన్నారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకే ఓటేయాలని కోరారు.
గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి సన్నీ డియోల్ను గెలిపించారని, ఆయన ఏనాడైనా మీ దగ్గరికి వచ్చాడా..? అని కేజ్రీవాల్ ప్రశ్నించారు. ప్రజల మధ్యకు రాలేని వ్యక్తిని ప్రజాప్రతినిధిగా గెలిపిస్తే ఏం ప్రయోజనమని ప్రశ్నించారు. సన్నీ డియోల్ పెద్ద నటుడు, ఆయనను గెలిపిస్తే మన కోసం ఏదన్నా చేస్తాడని అంతా ఆశించామని.. కానీ అలాంటి పెద్దవాళ్లు సామాన్యులకు ఏమీ చేయరని అన్నారు. కాబట్టి ఈసారి ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని, వాళ్లు మీకు పనులు చేసి పెడతారని కేజ్రివాల్ చెప్పారు.