Terrorist Caught In Jammu | జమ్ముకశ్మీర్లో స్థానికులే ఆదివారం వాంటెడ్ లష్కర్-ఈ-తొయిబా ఉగ్రవాదిని పట్టుకున్నారు. అటుపై పోలీసులకు అప్పగించారు. అయితే, అతడు బీజేపీ యాక్టివ్ కార్యకర్త కావడం గమనార్హం. బీజేపీ మైనారిటీ మోర్చా సోషల్ మీడియా జమ్ము ఇన్చార్జి కూడా. జమ్ములోని రియాసీ ప్రాంతంలో ఆదివారం ఉదయం లష్కరే ఈ తొయిబా ఉగ్రవాది తాలిబ్ హుస్సేన్ షా, ఆయన అనుచరులను స్థానికులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి రెండు ఏకే రైఫిల్స్, పలు హ్యాండ్ గ్రనేడ్లు, ఇతర ఆయుధాలు, మందుగుండు సామగ్రి స్వాధీనం చేసుకున్నారు. ఆ ఉగ్రవాదులను స్థానిక పోలీసులకు అప్పగించారు.
అయితే, వ్యక్తుల నేపథ్యం తనిఖీ చేయకుండానే ఆన్లైన్లో పార్టీసభ్యత్వం ఇవ్వడమే దీనికి కారణమని బీజేపీ చెబుతున్నది. `ఈ అరెస్ట్తో కొత్త అంశం వెలుగులోకి వచ్చింది` అని బీజేపీ అధికార ప్రతినిధి ఆర్ఎస్ పథానియా చెప్పారు. `ఈ రోజు ఇది కొత్త మోడల్. బీజేపీలోకి ప్రవేశించి, నాయకులతో సాన్నిహిత్యం పెంచుకుని అగ్రనేతలను చంపేందుకు చేసిన కుట్రను పోలీసులు బయటపెట్టారు` అని అన్నారు.
`సరిహద్దు పొడవునా ఉగ్రవాదాన్ని ప్రోత్సహించాలని కోరుకుంటున్నవారు ఎవరైనా ఆన్లైన్లో బీజేపీ సభ్యత్వం పొందొచ్చు. ఆన్లైన్లో బీజేపీ సభ్యత్వం తీసుకుంటున్న వారి క్రిమినల్ రికార్డు చెక్ చేయడానికి ఎటువంటి వ్యవస్థ లేకపోవడం లోపమే` అని ఆర్ఎస్ పథానియా అన్నారు. గత మే 9న బీజేపీ జమ్ము ఐటీ, సోషల్ మీడియా ఇన్చార్జిగా తాలిబ్ హుస్సేన్ షాను బీజేపీ నియమించింది. అతడి వద్ద ఫోన్లో జమ్ముకశ్మీర్ బీజేపీ అధ్యక్షుడు రవీంద్ర రైనాతోపాటు పలువురు సీనియర్ నేతల ఫొటోలు ఉన్నాయని అన్నారు.
ఇదిలా ఉండగా, తాలిబ్ హుస్సేన్ అనే లష్కర్-ఈ-తొయిబా ఉగ్రవాదిని పట్టుకున్న గ్రామస్థులకు, జమ్ము కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్, పోలీసు అధిపతి క్యాష్ రికార్డు ప్రకటించారు. రియాసీలోని టుక్సన్ ఢోక్ గ్రామస్తుల ధైర్యాన్ని అభినందిస్తున్నట్లు అదనపు డీజీపీ ముకేశ్ సింగ్ తెలిపారు. ఉగ్రవాదులను పట్టుకున్న గ్రామస్తులకు డీజీపీ రూ.2 లక్షల నగదు అవార్డు ప్రకటించారు. లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా రూ.5 లక్షల అవార్డు ప్రకటించారు.