శ్రీనగర్, సెప్టెంబర్ 19: లష్కరే తోయిబా కమాండర్ ఉజైర్ ఖాన్, మరో ఉగ్రవాదిని భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. ఈ ఇద్దరి మృతదేహాలు ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశంలో లభ్యమయ్యాయని కశ్మీర్ అదనపు డీజీపీ విజయ్ కుమార్ మంగళవారం తెలిపారు. గత ఏడు రోజులుగా అనంత్నాగ్ జిల్లాలో కొనసాగిన ఎన్కౌంటర్ ముగిసిందని ప్రకటించారు.
దక్షిణ కశ్మీర్లోని గదోలే అటవీ ప్రాంతంలో గత బుధవారం ఎన్కౌంటర్ మొదలైందని, అయితే భద్రతా బలగాల సెర్చ్ ఆపరేషన్ మాత్రం కొనసాగుతున్నదని ఆయన చెప్పారు. ఈ ఎన్కౌంటర్లో ఇద్దరు ఆర్మీ అధికారులు, ఒక పోలీస్ ఉన్నతాధికారి, నలుగురు జవాన్లు ఉగ్రవాదుల తూటాలకు బలయ్యారు.