(స్పెషల్ టాస్క్ బ్యూరో)
హైదరాబాద్, మార్చి 27 (నమస్తే తెలంగాణ): ‘విదేశాల్లోని డొల్ల కంపెనీల ద్వారా అదానీ గ్రూప్ కంపెనీల్లోకి పెద్దయెత్తున పెట్టుబడులు వచ్చాయి. అదానీ అక్రమాలపై జేపీసీ వేయాలి’ అంటూ బీఆర్ఎస్ ఎంపీలు సహా ప్రతిపక్ష పార్టీ నేతలు కొన్నిరోజులుగా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ, దీనిపై స్పందించని కేంద్రంలోని బీజేపీ సర్కారు.. అసలు డొల్ల కంపెనీలంటే ఏంటో తెలియదని, వాటి సమాచారం లేదని కొత్త కథను తెరమీదకు తీసుకొచ్చింది.
భారతీయ పౌరులు యజమానులుగా (యూబీవో) ఉన్న విదేశాల్లోని డొల్ల కంపెనీల సమాచారం ఇవ్వాలంటూ సీపీఎం ఎంపీ జాన్ బ్రిటాస్ రాజ్యసభలో కేంద్రాన్ని కోరారు. దీనిపై ఆర్థికశాఖ సహాయమంత్రి పంకజ్ చౌదరి స్పందించారు. విదేశాల్లో డొల్ల కంపెనీ అంటే ఏమిటో అన్నదానికి ఆర్థికశాఖ పరిధిలోని చట్టాల్లో ఎలాంటి నిర్వచనం లేదని సమాధానమిచ్చారు. భారతీయులు యజమానులుగా ఉన్న విదేశాల్లోని డొల్ల కంపెనీల సమాచారం తమ దగ్గర లేదని పేర్కొన్నారు.
డొల్ల కంపెనీల సమాచారం లేదంటూ ఇప్పుడు దాటవేత ధోరణి ప్రదర్శిస్తున్న కేంద్రం.. రెండేండ్ల కిందట ఆ సమాచారాన్ని ఇవ్వడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 2018-2021 మధ్య 2,38,223 డొల్ల కంపెనీలను గుర్తించినట్టు కేంద్రమంత్రి రావ్ ఇంద్రజిత్ సింగ్ 2021 జూలై 27న రాజ్యసభకు తెలియజేశారు. కాగా, అదానీ అక్రమాల్లో ఆయన సోదరుడు వినోద్ అదానీకి చెందిన డొల్ల కంపెనీల పాత్ర ఉండటం వల్లే కేంద్రం ఆ సమాచారం ఇవ్వకుండా అబద్ధాలు చెబుతున్నదని విశ్లేషకులు మండిపడుతున్నారు.c