Bihar : నేపాల్ వరదల కారణంగా బిహార్కు మరో ముప్పు వచ్చి పడింది. నేపాల్ వరద నీటి ద్వారా భారీ చేపలు బిహార్ కొట్టుకొస్తున్నాయి. నేపాల్ నుంచి కొట్టుకొస్తున్న చేపలు తిని పలువురు అనారోగ్యం పాలవుతున్నారు. దీంతో ఆ చేపల్ని తినకూడదని బిహార్ ప్రభుత్వం ప్రజలకు ఆదేశించింది. నేపాల్ వరదల కారణంగా బిహార్లోని పలు నదుల్లోకి అక్కడి నీరు వచ్చి చేరుతోంది. ఆ నీటితోపాటు నేపాల్ నుంచి కొత్త రకం చేపలు బిహార్ పరిధి నదుల్లో కలుస్తున్నాయి.
భారీ సంఖ్యలో ఈ చేపలు కొట్టుకు వస్తున్నాయి. దీంతో కొందరు జాలర్లు, స్థానికులు వీటిని వేటాడి పట్టుకొస్తున్నారు. స్తానిక మార్కెట్లలో విక్రయిస్తున్నారు. వీటిని తిన్న చాలా మంది తీవ్ర అనారోగ్యం పాలవుతున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. నేపాల్ నుంచి వచ్చిన ఈ చేపల్ని తిన్నవారు అనారోగ్యానికి గురవుతున్నారు. వీటిపై అధ్యయనం చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఆ చేపల్ని తినకూడదని ప్రజలకు సూచించింది. అలాగే, విక్రయాలు కూడా చేయరాదని జాలర్లు, వ్యాపారుల్ని ఆదేశించింది. మనకు తెలియని, నేపాల్ నుంచి వచ్చిన కొత్త రకం చేపలకు దూరంగా ఉండాలని కోరింది.
ముఖ్యంగా వరదలు వంటి పరిస్థితులు చక్కబడే వరకు అసలు వాటి జోలికే వెళ్లకూడదని హెచ్చరించింది. దీనికి కారణం ఉంది. అవి నేపాల్కు చెందిన చేపలు. మన దగ్గర సాధారణంగా దొరకవు. వరద నీటి కారణంగా అవి ఇండియాకు వస్తున్నాయి. ఇలా నదుల్లో ప్రవహించే చేపలు.. వరదలు వంటివి వచ్చినప్పుడు కొత్త ప్రదేశాలకు వెళ్తుంటాయి. అలా, ఇండియా వస్తున్నాయి. ఇలా విపత్తుల సమయంలో అనేక చేపలు, ఇతర జీవులు మరణిస్తుంటాయి. పైగా ఇవి కొన్నిసార్లు మురికి కాల్వల గుండా ప్రయాణిస్తుంటాయి.
మురికి నీటి నుంచి రావడం, ఇతర కళేబరాలు, కలుషిత నీటిలో తిరగడం, ఆహారం తీసుకోవడం వల్ల ఈ చేపలు వివిధ రకాల బ్యాక్టీరియా, వైరస్లకు నిలయంగా మారుతాయి. అలాంటి చేపల్ని తిన్నవారు అస్వస్థతకు గురవుతారు. అందుకే వాటికి దూరంగా ఉండాలని ప్రభుత్వం సూచించింది. అప్రమత్తంగా ఉండాలని ఆదేశించింది. ముఖ్యంగా మనకు పెద్దగా పరిచయం లేని, కొత్త రకం చేపల్ని తినకూడదని సూచించింది. పొరపాటున తిన్నప్పటికీ.. ఒంటిలో కలిగే అనారోగ్య మార్పుల్ని గుర్తించాలని సూచించింది.