Land For Job Case | రైల్వే భూములకు సంబంధించిన కుంభకోణంలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) బుధవారం ఢిల్లీ కోర్టులో అనుబంధ ఛార్జిషీట్ను దాఖలు చేసింది. ఈ ఛార్జిషీట్లో బిహార్ మాజీ సీఎం, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన కుటుంబీకులతో పాటు మరికొందరి పేర్లున్నాయి. న్యాయమూర్తి విశాల్ గోగానే ప్రత్యేక ప్రత్యేకోర్టులో సీబీఐ అనుబంధ ఛార్జిషీట్ను దాఖలు చేసింది. ఈ ఛార్జిషీట్పై విచారణ చేపట్టాలా? వద్దా? అనే అంశంపై న్యాయమూర్తి ఈ నెల 14న తేల్చనున్నారు.
ఈ కేసులో ఫిబ్రవరి 28న రబ్రీదేవి, ఆమె కుమార్తెలు మిసా భారతి, హేమా యాదవ్లకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. లాలూ ప్రసాద్ యాదవ్ 2004 నుంచి 2009 వరకు రైల్వేమంత్రిగా పని చేశారు. ఆ సమయంలో మధ్యప్రదేశ్ జబల్పూర్లోని వెస్ట్ సెంట్రల్ రైల్వేజోన్ గ్రూప్-డీ పోస్టులు నియామకమయ్యాయి. ఉద్యోగాలు పొందిన అభ్యర్థుల నుంచి లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబం, సహచరుల పేరుతో భూములను తీసుకున్నట్లుగా ఆరోపణలున్నాయి. ఈ కేసులో లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన సతీమణి రబ్రీదేవి సహా 15 మందిపై 2022 మే 18న సీబీఐ కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నది.