ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం మళ్లీ విషమించింది. దీంతో ఆయన్ను ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించాలని వైద్యులు సూచించారు. ఆరోగ్యం సహకరించకపోవడంతో వైద్యులు ఆయనకు పరీక్షలు నిర్వహించారు. పరిస్థితి విషమించడంతో వెంటనే ఆయన్ను ఎయిమ్స్కు తరలించాలని సూచించారు. దీంతో ఆయన్ను హుటాహుటిన విమానంలో ఢిల్లీకి తీసుకెళ్లనున్నారు. ఈ విషయంపై రాంచీ రిమ్స్ వైద్యులు మాట్లాడారు.
అన్ని వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత, పరిస్థితులను బేరీజు వేసుకొని, లాలూను ఏయిమ్స్కు పంపాలని నిర్ణయించినట్లు రిమ్స్ డైరెక్టర్ కామేశ్వర్ ప్రసాద్ వెల్లడించారు. జైలు అధికారుల నియమ నిబంధనలన్నీ పూర్తి చేసిన తర్వాత, ఆయన్ను ఎయిమ్స్కు తరలిస్తామని వైద్యులు పేర్కొన్నారు. లాలూకు గుండె జబ్బులు, కిడ్నీ జబ్బులు, మధుమేహం లాంటి ఇబ్బందులున్న నేపథ్యంలో వైద్యులు ఆయన ఆరోగ్య పరీక్షల నిమిత్తం ఓ వైద్య బృందాన్ని కూడా ఏర్పాటు చేశారు.