Lalu Health Critical | ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ కదల్లేకపోతున్నారని ఆయన తనయుడు, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ చెప్పారు. ఇటీవల ఆదివారం తన ఇంట్లో మెట్లపై నుంచి లాలూ కింద పడిపోవడంతో కుడి భుజంతోపాటు మూడు చోట్ల ఫ్రాక్చరైంది. దీంతో కండరాలు, కీళ్లు పట్టేసి సమస్య తీవ్రంగా ఉందని తేజస్వి చెప్పారని ఓ వార్తా సంస్థ తెలిపింది. అందువల్ల ఎక్కువగా కదల్లేకపోతున్నారని తెలిపారు. త్వరలో కోలుకుంటారని తాము ఆశిస్తున్నట్లు చెప్పారు. తామంతా దవాఖానలో ఆయన వెంటే ఉన్నామని వివరించారు.
ఇంతకుముందే కొంత కాలంగా కిడ్నీ, గుండె సంబంధ సమస్యలతో లాలూ ప్రసాద్ యాదవ్ బాధ పడుతున్నారు. తాజాగా మూడు చోట్ల ఫ్రాక్చర్లు కావడంతో కీళ్లు, కండరాలు పట్టేశాయి. ఫలితంగా ఆయన శరీరంలో కదలికలు అతి స్వల్పంగా ఉన్నాయని తేజస్వి యాదవ్ చెప్పారు. కుడి భుజానికి ఫ్రాక్చర్ కావడంతో తొలుత పాట్నాలోని ప్రైవేట్ దవాఖానలో లాలూకు చికిత్స అందించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం లాలూను ఢిల్లీలోని ఎయిమ్స్ దవాఖానకు తరలించారు.
నాన్న వైద్య అవసరాలు ఎయిమ్స్ వైద్యులకు తెలుసునని, అందుకే ఢిల్లీ ఎయిమ్స్లో చేర్చామని తేజస్వి యాదవ్ చెప్పారు. ఇదిలా ఉంటే `లాలూ ఆరోగ్యం కాసింత మెరుగు పడింది. ఆయన క్షేమం కోసం ప్రార్థించండి, త్వరలో ఇంటికి తరిగి వస్తారు` అని లాలూ సతీమణి రబ్రీదేవి చెప్పారు. లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం క్షీణిస్తున్నదని, కిడ్నీ మార్పిడికి సింగపూర్కు వెళ్లేందుకు అనుమతించాలని ఇటీవల కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. భుజానికి గాయం కావడంతో ఢిల్లీలో ఎయిమ్స్ వైద్యుల సలహా మేరకు నిర్ణయం తీసుకుంటామని తేజస్వి యాదవ్ తెలిపారు. మరోవైపు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్.. తేజస్వి యాదవ్కు ఫోన్ చేసి లాలూ ఆరోగ్య పరిస్థితిపై వాకబు చేశారు.