న్యూఢిల్లీ: ప్రధాని మోదీ పాలనలో దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ ఉందని, దీనికి వ్యతిరేకంగా దేశ ప్రజలంతా ఒక్కటవుతారని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. 1975 నాటి ఎమర్జెన్సీని మరో పద్ధతిలో ప్రధాని మోదీ అమల్లో పెడుతున్నారని లాలూ విమర్శించారు. అయితే ఈ వ్యాఖ్యలు ఆయన బయోగ్రఫీ ‘గోపాల్గంజ్ టు రైసానా:మై పొలిటికల్ జర్నీ’లోనివి. ఎమర్జెన్సీకి 50ఏండ్లు పూర్తయిన సందర్భంగా, ఈ పుస్తక సహ రచయిత, సీనియర్ జర్నలిస్టు నళిన్ వర్మ మరోమారు ప్రస్తావించారు. లాలూ వ్యాఖ్యల్ని ఓ ఆంగ్ల న్యూస్ వెబ్ పోర్టల్ తాజాగా ప్రచురించింది. ‘ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో బీజేపీ, ఆరెస్సెస్కు ఎలాంటి పాత్ర లేదు. వారు బాధితులు కూడా కాదు. అలాంటిది..తాము బాధితులమని, ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడామని నేడు కేంద్ర మంత్రులు గొప్పలు చెబుతుంటే, నవ్వొస్తున్నది. నాడు ఇందిరాగాంధీ కన్నా దారుణంగా ప్రధాని మోదీ వ్యవహరిస్తున్నారు’ అని లాలూ విమర్శించారు.