Lalrin Puia : లోక్సభ తొలి విడత ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఒక అపశృతి చోటుచేసుకుంది. మిజోరంలో ఎన్నికల విధుల్లో ఉన్న ఓ జవాన్ గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయాడు. పోస్టుమార్టం అనంతరం అతని మృతదేహాన్ని స్వస్థలానికి పంపించారు.
వివరాల్లోకి వెళ్తే.. మిజోరం రాష్ట్రం ఖవ్జాల్ జిల్లాలోని కౌల్కుల్హ్ గ్రామానికి చెందిన లాలిరిన్ పుయ్యా (28) సెకండ్ ఇండియన్ రిజర్వ్ బెటాలియన్లో జవాన్గా విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఆయనకు తొలి విడత లోక్సభ ఎన్నికల నేపథ్యంలో చంపాయ్ జిల్లాలో ఎలక్షన్ డ్యూటీ వేశారు.
చంపాయ్ చేరుకున్న లాల్రిన్ పుయ్యా గురువారం రాత్రి భోజనం తర్వాత తోటి సిబ్బందితో కలిసి పడుకున్నారు. తెల్లవారుజామున తోటి జవాన్ లేపే ప్రయత్నం చేయగా అతనిలో కదలిక లేదు. సహచరులు ఇచ్చిన సమాచారం మేరకు లాల్రిన్ ఈ తెల్లవారుజామున 4.45 గంటలకు గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయారని అధికారులు ప్రకటించారు.
పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం లాల్రిన్ భౌతిక కాయాన్ని ఆయన స్వస్థలానికి పంపించారు. చంపాయ్ నగర డిప్యూటీ కమిషనర్, జిల్లా ఎన్నికల అధికారి జేమ్స్ లాల్రిన్చనా, చంపాయ్ జిల్లా ఎస్పీ వినీత్ కుమార్ ఈ సెండాఫ్ కార్యక్రమంలో పాల్గొన్నారు.