జైపూర్: ఒక సంస్థకు చెందిన ప్రైవేట్ లాకర్లలో ఆదాయపు పన్ను శాఖ (ఐటీ) అధికారులు సోదాలు చేశారు. ఒక లాకర్లో లక్షల్లో డబ్బులు కనుగొన్నారు. మరో లాకర్లోని సంచిలో భారీగా ఉన్న నోట్ల కట్టలను లెక్కిస్తున్నారు. రాజస్థాన్ రాజధాని జైపూర్లో ఈ సంఘటన జరిగింది. టీచర్ రిక్రూట్మెంట్ పేపర్ లీక్ ద్వారా సంపాదించిన నల్ల ధనాన్ని జైపూర్లోని గణపతి ప్లాజాలోని ప్రైవేట్ లాకర్లలో (Jaipur’s Ganpati Plaza lockers) ఉంచారని బీజేపీ ఎంపీ కిరోరి లాల్ మీనా గత నెలలో ఆరోపించారు. ఈ నేపథ్యంలో గణపతి ప్లాజాలో ఉన్న సుమారు 1,100 లాకర్లను ఐటీ అధికారులు తెరిచి చూస్తున్నారు. అక్టోబర్ 17న మూడు లాకర్ల నుంచి సుమారు రూ.30 లక్షలు, అక్టోబర్ 21న మరికొన్ని లాకర్ల నుంచి రూ.2.46 కోట్ల డబ్బును స్వాధీనం చేసుకున్నారు.
కాగా, శుక్రవారం గణపతి ప్లాజాలోని మరికొన్ని లాకర్లను ఐటీ అధికారులు తెరిచారు. ఒక లాకర్ నుంచి 7.5 లక్షల డబ్బును స్వాధీనం చేసుకున్నారు. మరో లాకర్లో కరెన్సీ నోట్లతో కూడిన సంచిని కనుగొన్నారు. అందులో ఉన్న నోట్ల కట్టలను లెక్కిస్తున్నారు. ఇప్పటి వరకు గణపతి ప్లాజాలోని లాకర్ల నుంచి ఏడు కోట్లకు పైగా డబ్బు, 12 కిలోలకు పైగా బంగారాన్ని ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
గతేడాది డిసెంబర్లో గ్రేడ్ 2 టీచర్ రిక్రూట్మెంట్ పేపర్ లీక్ అయ్యింది. ఈ నేపథ్యంలో ఆ పరీక్షను రద్దు చేశారు. పేపర్ లీక్ కేసుకు సంబంధించి 37 మంది అభ్యర్థులు సహా 55 మందిని పోలీసులు అరెస్టు చేశారు. రూ.60 లక్షలకు పేపర్ను లీక్ చేసినట్లు దర్యాప్తులో పేర్కొన్న రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుడు బాబులాల్ కటారాను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు చేసింది.
#WATCH | Rajasthan | Income Tax search underway at Ganpati Plaza in Jaipur, related to black money. In the first phase, two lockers were cut opened and Lakhs of cash was recovered from one of the lockers. A sack full of currency notes was found from the second locker and counting… pic.twitter.com/ilWGWVwp0n
— ANI (@ANI) November 10, 2023