న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖేరిలో చెలరేగిన హింసలో 8 మంది మృతిచెందిన విషయం తెలిసిందే. ఆ ఘటనపై దాఖలు అయిన సుమోటో కేసును ఇవాళ సుప్రీంకోర్టులో విచారించారు. అయితే లఖింపుర్ ఘటనలో యూపీ పోలీసులు నిర్వహిస్తున్న దర్యాప్తు సంతృప్తికరంగా లేదని సుప్రీంకోర్టు తెలిపింది. సాక్ష్యాలను భద్రపరుచాలని కోర్టు పేర్కొన్నది. మళ్లీ ఈనెల 20వ తేదీన ఈ కేసును విచారించనున్నారు. ఇవాళ విచారణ సందర్భంగా యూపీ సర్కార్ తరపున సీనియర్ అడ్వకేట్ హరీశ్ సాల్వే తరపున వాదించారు. రాష్ట్రానికి చెందిన ఉన్నత పోలీసు అధికారికి సాక్ష్యాల భద్రత గురించి తెలియజేయనున్నట్లు ఆయన చెప్పారు.
యూపీ ప్రభుత్వం తీసుకున్న చర్యలతో సంతృప్తికరంగా లేమని, బాధ్యతాయుతమైన ప్రభుత్వం, పోలీసు వ్యవస్థను కోరుకుంటున్నామని, లఖింపూర్ ఘటనపై వస్తున్న ఆరోపణలు చాలా తీవ్ర స్థాయిలో ఉన్నాయని చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ పేర్కొన్నారు. మీరెటువంటి సందేశాన్ని ఇస్తున్నారు, సాధారణ పరిస్థితుల్లో పోలీసుల వెంటనే వెళ్లి నిందితుల్ని అరెస్టు చేయరా అని సీజే ప్రశ్నించారు. జరుగాల్సిన పద్ధతిలో దర్యాప్తు సాగడం లేదని, మాటలు తప్ప చేతలు లేవని సీజే రమణ విచారణ సమయంలో యూపీ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు.
సీబీఐ పరిష్కారం కాదు..
యూపీ ప్రభుత్వం ఇచ్చిన నివేదికను అడ్వకేట్ హరీశ్ సాల్వే సుప్రీంకు సమర్పించారు. ఒకవేళ ఆ నివేదిక సంతృప్తికరంగా లేకుంటే, అప్పుడు ఆ కేసును సీబీఐకి అప్పగించాలని సాల్వే సూచించారు. అయితే సాల్వే సూచనను స్వాగతించిన సీజే.. సమస్య చాలా సున్నితమైందని, ఈ విషయంలో మేం ఎటువంటి కామెంట్లు చేయడం లేదని, సీబీఐ దీనికి పరిష్కారం కాదు అని, అది ఎందుకు మీకు తెలుసు అని, ఈ కేసును మరో వ్యక్తి డీల్ చేస్తే బాగుంటుందని చీఫ్ జస్టిస్ అభిప్రాయపడ్డారు. రైతుల మరణానికి కారణాలు తీవ్ర స్థాయిలో ఉన్నప్పుడు, ఇలాంటి ఘటనల్లో ఇతర నిందుతులను ఇలాగే చూస్తారా అని సీజే అడిగారు.
మీడియా తీరు..
అడ్వకేట్ అగ్నిశ్ ఆదిత్య ఓ ట్వీట్ గురించి విచారణ సమయంలో ప్రస్తావించారు. లఖింపూర్ బాధిత కుటుంబాన్ని చీఫ్ జస్టిస్ పరామర్శించినట్లు టైమ్స్ నౌ చేసిన ఓ ట్వీట్ గురించి కోర్టులో అడిగారు. అయితే అవన్నీ టీవీ ముచ్చట్లు అని సీజేఐ రియాక్ట్ అయ్యారు. కానీ మీడియా వ్యవహరిస్తున్న తీరును జస్టిస్ కాంత్ ఖండించారు. భావ ప్రకటన, భావ స్వేచ్ఛను మీడియా అతిక్రమిస్తోందని ఆయన అన్నారు. అయితే ఈ కేసులో విచారణ సాఫీగా సాగాలన్న ఉద్దేశంతో ఆ అంశాన్ని సీజే పట్టించుకోలేదని జస్టిస్ కాంత్ అన్నారు. అలాంటి ట్వీట్లకు తామంతా బాధితులమే అని అడ్వకేట్ హరీశ్ సాల్వే అన్నారు. ఇలాంటి ట్వీట్ల విషయంలో కోర్టు ధిక్కరణ కేసు వేయాలని ఆయన అభిప్రాయపడ్డారు. మీడియాలో వస్తున్న వార్తలను ఖండించిన సీజేఐ.. తాను కోర్టులో ఉండగా, ఎలా లక్నో వెళ్లగలనని ప్రశ్నించారు. ఇదే సమయంలో జస్టిస్ హిమా కోహ్లీ స్పందిస్తూ.. మీడియా స్వేచ్ఛను గౌరవిస్తామని, కానీ హద్దులు దాటేందుకు ఇది మార్గం కాదన్నారు.