అహ్మదాబాద్ : గుజరాత్లోని బనస్కాంత జిల్లా సుగాం గ్రామంలోని చెరువు గులాబీ రంగులోకి మారడంతో పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామస్తులు దీన్ని దేవుడి లీలగా చెబుతూ ఆశ్చర్యానికి లోనవుతున్నారు. ఇండియా-పాకిస్తాన్ సరిహద్దులోని కొరేటి చెరువులో నీరు అనూహ్యంగా గులాబీ రంగులోకి మారింది.
ఈ విషయం బయటకు రావడంతో సమీప గ్రామాల ప్రజలు పెద్దసంఖ్యలో సరస్సులో నీటిని చూసేందుకు తరలివచ్చారు. వర్షపు నీటితో ఈ చెరువు నిండుతుండగా ఏడాది పాటు గ్రామస్తులు నీటిని వాడుకుంటారు. సమీపంలోని మహదేవ్ ఆలయ లీలతోనే చెరువులో నీరు గులాబీ రంగులోకి మారిందని గ్రామస్తులు నమ్ముతున్నారు.
స్ధానిక అధికారులు చెరువు నీటి నమూనాలను పరీక్షల కోసం పంపారు. ప్రస్తుతానికి చెరువు నీటిని ఎలాంటి అవసరాలకూ వాడకూడదని గ్రామస్తులకు సూచించామని తెహసిల్ డెవలప్మెంట్ అధికారి కేఏ భాటియా తెలిపారు. ఇక చెరువు నీటిలో వరద నీరు కలవడంతోనే కెమికల్ రియాక్షన్ కారణంగా చెరువు నీరు గులాబీ రంగులోకి మారిందని నిపుణులు చెబుతున్నారు.