సివిల్స్లో మహిళల ముందంజ
టాప్ 3 ర్యాంకులు వాళ్లవే.. ఏడేండ్ల తర్వాత ఇదే తొలిసారి.. టాపర్గా శృతి శర్మ
రాష్ట్ర స్థాయి ర్యాంకుల్లోనూ టాప్ 2 అమ్మాయిలే
సివిల్స్ 2021 ఫలితాలు ప్రకటించిన యూపీఎస్సీ
టాపర్గా శ్రుతిశర్మ, అంకిత, గామినికి రెండు, మూడు
ఈ ఏడాది వివిధ సర్వీసులకు 685 మంది ఎంపిక
508 మంది పురుషులు, 177 మంది మహిళలు
మన రాష్ట్రం నుంచి దాదాపు 20 మందికి ర్యాంకులు
న్యూఢిల్లీ/హైదరాబాద్ మే 30: దేశంలో అత్యున్నతమైన, అత్యంత కఠినమైనదిగా పేరుపొందిన సివిల్ సర్వీసెస్ పరీక్ష (సీఎస్ఈ)లో అమ్మాయిలు అదరగొట్టారు. సోమవారం విడుదలైన సివిల్ సర్వీసెస్-2021 పరీక్ష ఫలితాల్లో జాతీయ స్థాయిలో టాప్ 3 ర్యాంకులు మహిళలే సొంతం చేసుకొన్నారు. తెలంగాణలో రాష్ట్రస్థాయి ర్యాంకుల్లో మొదటి 5 ర్యాంకుల్లో ఏకంగా నలుగురు అమ్మాయిలే ఉండటం విశేషం. 2021 సీఎస్ఈలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) మొత్తంగా 685 మందిని వివిధ సర్వీసులకు ఎంపికచేసింది. వీరిలో పురుషులు 508 మంది, మహిళలు 177 మంది ఉన్నారు. ఢిల్లీలో స్థిరపడిన ఉత్తరప్రదేశ్కు చెందిన శ్రుతిశర్మ ఒకటో ర్యాంకు సాధించారు. అంకితా అగర్వాల్ రెండో ర్యాంకు, గామిని సింగ్లా మూడో ర్యాంకు సొంతం చేసుకొన్నారు. టాప్ 25 ట్యాంకుల్లో 15 మంది పురుషులు, 10 మంది మహిళలు ఉన్నారు.
ఈ ఏడాది మొదటి 25 స్థానాల్లో నిలిచినవారిలో అత్యధికమంది దేశంలోని అత్యున్నతమైన ఐఐటీలు, ఐఐఎంలు, విట్, పీఈసీ, యూనివర్సిటీ ఆఫ్ ముంబై, యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ, జీబీ పంత్ యూనివర్సిటీలో చదివినవారేనని యూపీఎస్సీ తెలిపింది. ఈసారి సివిల్స్ ఫలితాల్లో ముస్లిం అభ్యర్థుల సంఖ్య ఈ దశాబ్దంలోనే అతి తక్కువగా నమోదైంది. 2021 సీఎస్ఈ ప్రిలిమ్స్ పరీక్షను గత ఏడాది అక్టోబర్ 10న నిర్వహించారు. మొత్తం 5.08 లక్షల మంది పరీక్ష రాయగా, 9,214 మంది మెయిన్స్కు అర్హత సాధించారు. వీరిలో 1,824 మంది ఇంటర్వ్యూలకు ఎంపికయ్యారు. అందులో 685 మందిని సర్వీసులకు ఎంపిక చేసినట్టు యూపీఎస్సీ సోమవారం ప్రకటించింది.
నిజానికి 2021 సీఎస్ఈ నోటిఫికేషన్ 749 పోస్టులతో యూపీఎస్సీ జారీ చేసింది. ఇందులో 180 ఐఏఎస్, 200 ఐపీఎస్, ఐఎఫ్ఎస్ 37 పోస్టులున్నాయి. యూపీఎస్సీ సెంట్రల్ సర్వీసెస్ గ్రూప్ – ఏకు 242, గ్రూప్-బీకి 90 మందిని ఎంపికచేసింది. వీరిలో తెలంగాణకు చెందినవారు 20 మంది వరకు ఉన్నారు. యూపీఎస్సీ నోటిఫికేషన్లో పేర్కొన్న మొత్తం పోస్టులకు అభ్యర్థులను ఎంపికచేయలేదు. 80 మందిని ప్రొవిజనల్ జాబితాలో ఉంచినట్టు తెలిపింది. కేంద్ర ప్రభుత్వం అవసరం అనుకొంటే వీరికి సర్వీసులు కేటాయిస్తుంది. ఒక అభ్యర్థి ఫలితాన్ని నిలిపివేసినట్టు వెల్లడించింది. అందరు అభ్యర్థులకు సంబంధించిన మార్కులు యూపీఎస్సీ వెబ్సైట్లో ఉంచింది.
తల్లిదండ్రుల ప్రోత్సాహం వల్లే: శ్రుతి శర్మ
యూపీలోని బిజ్నూర్కు చెందిన శ్రుతి శర్మ ఢిల్లీ యూనివర్సిటీ పరిధిలోని సెయింట్ స్టీఫెన్స్ కాలేజీ నుంచి హిస్టరీ (ఆనర్స్)లో గ్రాడ్యుయేషన్ చేశారు. జేఎన్యూలో పీజీ చేశారు. సివిల్స్ కోసం నాలుగేండ్లుగా ప్రిపేర్ అవుతున్నారు. జామియా మిలియా ఇస్లామియా రెసిడెన్షియల్ కోచింగ్ అకాడమీలో శిక్షణ తీసుకొన్నారు. ‘మొదటి ర్యాంకు వస్తుందని ఊహించలేదు. సివిల్స్ కోసం నా తల్లిదండ్రులు నన్ను ఎంతో ప్రోత్సహించారు. స్నేహితులు చాలా సాయం చేశారు’ అని శ్రుతి తెలిపారు.
మహిళా సాధికారత కోసం పనిచేస్తా: అంకిత
అంకితా అగర్వాల్ స్వస్థలం కోల్కతా. ఢిల్లీ సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలోనే ఎకనామిక్స్ (ఆనర్స్)లో డిగ్రీ చేశారు. సివిల్స్ కోసం ఇది ఆమెకు మూడో అటెంప్ట్. తొలి ప్రయత్నంలో అంకిత ఐఆర్ఎస్కు ఎంపికయ్యారు. ఫరీదాబాద్లో శిక్షణ తీసుకొంటూనే మళ్లీ పరీక్ష రాసి రెండో ర్యాంకు సాధించారు. ‘మొదటి మూడు ర్యాంకులు అమ్మాయిలే సాధించడం గొప్ప విషయం. ఇది దేశానికి గర్వకారణం’ అని ఆమె అన్నారు.ఐఏఎస్లో చేరిన తర్వాత మహిళా సాధికారత కోసం కృషి చేస్తానని చెప్పారు.
ఇంటి దగ్గరే ప్రిపేర్ అయ్యాను: గామిని
గామిని సింగ్లా పంజాబ్కు చెందినవారు. ఇది ఆమెకు రెండో అటెంప్ట్. ‘రోజుకు 9-10 గంటలు చదివేదాన్ని. పాటియాలాలోని వినోద్ సర్ దగ్గర కోచింగ్ తీసుకొన్నాను. తర్వాత ఇంటి దగ్గరే ప్రిపేర్ అయ్యాను. మా నాన్న నన్ను చాలా ప్రోత్సహించారు. దేశాభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం పనిచేయడానికి ఐఏఎస్ను ఎంచుకొన్నాను. నా కల నిజమైంది. చాలా సంతోషంగా ఉన్నది’ అని చెప్పారు.