PM Naredra Modi | కర్ణాటక రాజధాని బెంగళూరులో శుక్రవారం (2022 నవంబర్ 11) నాడు బెంగళూర్ ఫౌండర్ నాదప్రభు కెంపెగౌడ 108 అడుగుల విగ్రహాన్ని ప్రధాని నరేంద్రమోదీ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి భారీ జన సమీకరణలో భాగంగా కొందరు కార్మికులను కూడా నియమించుకున్నారని ఫిర్యాదులు వచ్చాయి. తమకు ఇస్తామన్న డబ్బు చెల్లించలేదని 40 మంది ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.
చిక్కబళ్లపూర్ జిల్లా సిద్లాఘట్ట పోలీస్ స్టేషన్లో స్థానిక బీజేపీ నాయకుడు నందీశ్పై పోలీసులు కేసు నమోదు చేశారు. బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద కెంపెగౌడ విగ్రహావిష్కరణ కార్య్రమం వద్ద పని చేయడానికి కార్మికులను నియమించుకున్నారని పోలీసులు చెప్పారు. ఒక్కొక్కరికి రూ.500 ఇస్తామని నందీశ్ ఆఫర్ చేసి, కార్యక్రమం పూర్తయ్యాక రూ.100లతో సరిపెట్టారని ఆరోపణలు ఉన్నాయి. ఈ అంశంపై దర్యాప్తు కొనసాగుతున్నదని పోలీసులు తెలిపారు.