న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్లోని హరిద్వార్లో జరుగుతున్న కుంభమేళా ఇక ముగిసే అవకాశాలు ఉన్నాయి. కుంభమేళాపై ప్రధాని మోదీ ఇవాళ తన ట్విట్టర్లో స్పందించారు. కుంభమేళా మహా వేడుకను ఇక ఒక సంకేతంగా మాత్రమే చూడాలన్నారు. కరోనా సంక్షోభ వేళ కుంభమేళాను నిలిపివేయడం ఉత్తమం అన్న అభిప్రాయాన్ని ఆయన వినిపించారు. భక్తుల రద్దీ లేకుండా చూడాలన్నారు. నిరంజనీ అకారా సాధువుల క్షేమ సమాచారం తెలుసుకున్నట్లు మోదీ చెప్పారు. హరిద్వార్లో జరుగుతున్న కుంభమేళాలో సాధువులు పుణ్య స్నానాలు ఆచరిస్తున్న విషయం తెలిసిందే. అయితే శుక్రవారం రోజున సుమారు 30 మంది సాధువులు కరోనా పరీక్షలో పాజిటివ్గా తేలారు.
ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ.. నిరంజనీ అకారా అధ్యక్షుడు స్వామి అవదేశానంద గిరి జీ మహారాజ్తో ఫోన్లో మాట్లాడారు. సాధువుల ఆరోగ్యం కోసం అన్ని రకాల సహాకారాలు అందించనున్నట్లు ప్రధాని వెల్లడించారు. ఇప్పటి వరకు కుంభమేళాలో సాధువులు రెండుసార్లు పుణ్య స్నానాలు చేశారని, ఇక కుంభమేళాలో జరిగే క్రతువులను ఒక ప్రతీకగా మాత్రమే ఉంచుదామని, దీని వల్ల కరోనా సంక్షోభంపై పోరాడేందుకు బలం వస్తుందని ప్రధాని తెలిపారు. నిరంజనీ అకారా కార్యదర్శి మహంత్ రవీంద్ర పురి కోవిడ్ పరీక్షలో పాజిటివ్గా తేలారు. నిరంజనీ అకారా చీఫ్ నరేంద్ర గిరి కూడా కోవిడ్ పరీక్షలో పాజిటివ్గా తేలారు. ఆయన్ను రిషికేశ్లోని ఎయిమ్స్లో అడ్మిట్ చేశారు.