తిరువనంతపురం: కేరళ సీఎం పినరయి విజయన్ (Pinarayi Vijayan) ప్రయాణించిన ప్రత్యేక బస్సుపై కాంగ్రెస్ విద్యార్థి విభాగానికి చెందిన కేరళ స్టూడెంట్స్ యూనియన్ (కేఎస్యూ) కార్యకర్తలు బూటు విసిరారు. ఈ సంఘటనకు పాల్పడిన నలుగురు విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా అధికార సీపీఎం విద్యార్థి విభాగం కార్యకర్తలు, కేఎస్యూ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఈ దాడిలో కొందరు గాయపడ్డారు.
కాగా, కేరళ సీఎం విజయన్ ఈ సంఘటనపై స్పందించారు. ఇలాంటి చర్యలకు పాల్పడిన వారికి తగిన శిక్ష పడుతుందని హెచ్చరించారు. అప్పుడు ఏడ్చినా ఎలాంటి ప్రయోజనం ఉండదని అన్నారు. నిరసనకారులు ఇలాంటి చర్యల ద్వారా హింసా మార్గాన్ని ఎంచుకుంటున్నారని మండిపడ్డారు.
మరోవైపు కేరళ సీఎం పినరయి విజయన్ తన మంత్రివర్గంతో కలిసి 140 అసెంబ్లీ నియోజకవర్గాల ప్రజలకు చేరువయ్యేందుకు శనివారం రాష్ట్రవ్యాప్తంగా బస్సుయాత్ర ప్రారంభించారు. ‘నవ కేరళ సదస్సు’ పేరుతో మంజేశ్వరం నుంచి ప్రారంభమైన బస్సు యాత్ర డిసెంబర్ 24న రాజధాని తిరువనంతపురంలో ముగుస్తుంది. అయితే విలాసవంతమైన బస్సు యాత్రపై ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్, బీజేపీ మండిపడ్డాయి. ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించాయి.