KSRTC : కేరళ (Kerala) అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections) లో తాము గెలిస్తే రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు ఉచిత రవాణా సదుపాయం కల్పిస్తామని హామీ ఇచ్చిన యూడీఎఫ్ కూటమి (UDF Alliance) అధికారం చేపట్టేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో కేఎస్ఆర్టీసీ (KS RTC) అధికారులు అప్పుడే సన్నాహాలు ప్రారంభించారు. బస్సుల్లో లింగ ఆధారిత టికెట్ల జారీ వ్యవస్థకు శనివారం నుంచి శ్రీకారంచుట్టారు. ఈ మేరకు ఎలక్ట్రానిక్ టికెటింగ్ మెషీన్ల (ETMs) లో మార్పులు చేశారు. ఈ మార్పుల ద్వారా ఇక నుంచి కండక్టర్లు జారీచేసే టికెట్లతో పురుషులు, మహిళలు, చిన్నపిల్లల సంఖ్య ఎంతో కచ్చితంగా తెలిసిపోతుంది.
ఈటీఎంల ద్వారా ఇచ్చే ముద్రిత టికెట్లపై ప్రయాణికుల కేటగిరీ ఉంటుందని అధికారులు తెలిపారు. యూడీఎఫ్ సర్కారు ఏర్పాటై ఎన్నికల హామీ అమలు చేయకముందే చేపట్టిన ఈ కసరత్తుతో రాష్ట్రంలో ప్రతి నిత్యం ఎంతమంది మహిళలు ప్రయాణం చేస్తున్నారన్న దానిపై ఒక అంచనాకు రావచ్చు. దాని ఆధారంగా మహిళలకు ఉచిత ప్రయాణంతో ప్రభుత్వంపై పడనున్న భారం ఎంతో తెలుసుకోవచ్చు. అయితే ఈ టికెట్ల జారీకి రద్దీ సమయాల్లో అదనపు సమయం కేటాయించాల్సి వస్తుందని కొంతమంది కండక్టర్లు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.