న్యూఢిల్లీ, మార్చి 16: దేశీయ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్)లో అనూహ్య మార్పులు చోటు చేసుకున్నాయి. కంపెనీ సీఈవో రాజేశ్ గోపినాథన్ తన పదవికి రాజీనామా చేశారు. దీంతో ఈ స్థానంలో కంపెనీ బీఎఫ్ఎస్ఐ డివిజన్ గ్లోబల్ హెడ్గా విధులు నిర్వహిస్తున్న కే క్రితివాసన్ను నూతన సీఈవోగా నియమితులయ్యారు. ఈ నియామకానికి షేరు హోల్డర్లు అనుమతించాల్సి ఉంటుంది. కంపెనీ సీఈవో పదవికి రాజేశ్ గోపినాథన్ రాజీనామా సెప్టెంబర్ 15, 2023 నుంచి వర్తిస్తున్నదని కంపెనీ బీఎస్ఈకి సమాచారమందించింది.
గడిచిన సంవత్సరంలో తన పదవీ కాలాన్ని ఫిబ్రవరి 20,2027 వరకు పొడిగిస్తూ టీసీఎస్ బోర్డు నిర్ణయం తీసుకున్నప్పటికీ అంతలోనే ఆయన రాజీనామా చేయడం విశేషం. టీసీఎస్లో 22 ఏండ్లుగా విధులు నిర్వహించిన గోపినాథన్..గడిచిన ఆరేండ్లుగా కంపెనీ ఎండీ, సీఈవోగా విధులు నిర్వహించారు. ఇతర ఆసక్తులపై ప్రత్యేక దృష్టి సారించేందుకు తన పదవికి రాజీనామా చేసినట్లు, కంపెనీ చైర్మన్, బోర్డు సభ్యులతో చర్చించిన తర్వాతనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు గోపినాథన్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.
గోపినాథన్ నాయకత్వంలో టీసీఎస్ అనూహ్యంగా 10 బిలియన్ డాలర్ల ఆదాయం ఆర్జించిన సంస్థగా రికార్డు సృష్టించింది. ఈ సందర్భంగా టీసీఎస్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ మాట్లాడుతూ..టీసీఎస్లో బలమైన నాయకత్వాన్ని తీర్చిదిద్దడంలో గోపినాథన్ కీలక పాత్ర పోషించారు..గత ఆరేండ్లలో టీసీఎస్ అన్ని విభాగాల్లో రాణించేందుకు ఆయన కృషి అమోఘం.. భవిష్యత్తులో ఆయనకు అంతా మంచే జరుగాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.