కోటా: కోచింగ్ సెంటర్లకు రాజస్థాన్లోని కోటా(Kota) చాలా ఫేమస్. అయితే ఆ నగరంలో రెండు రోజుల్లో ఇద్దరు టీనేజర్లు ఆత్మహత్య(Suicide) చేసుకున్నారు. వేర్వేరుగా జరిగిన ఈ ఘటనలు కలవరం రేపుతున్నాయి. విద్యార్థులు తీవ్రమైన మానసిక వత్తిడిలోకి వెళ్తున్నట్లు తెలుస్తోంది. పోటీ పరీక్షల కోసం కోటా నగరానికి దేశం నలుమూలల నుంచి విద్యార్థులు వస్తుంటారు. ఇటీవల మరణించిన ఆ ఇద్దరు విద్యార్థులు కేవలం రెండు నెలల క్రితమే కోటాకు వచ్చారు. నీట్ పరీక్ష ప్రిపేరయ్యేందుకు వాళ్లు ఆ నగరానికి వెళ్లారు.
మంగళవారం హాస్టల్ రూమ్లో ఓ 18 ఏళ్ల విద్యార్థి ఉరి వేసుకున్నాడు. ఉదయ్పూర్కు చెందిన అతను మెడికల్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేరవుతున్నాడు. అతన్ని మేహుల్ వైష్ణవ్గా గుర్తించారు. మెడికల్ పరీక్ష కోసం ప్రిపేరవుతున్న ఆదిత్య అనే మరో విద్యార్థి కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. గత రెండు నెలల్లో కోటాలో మొత్తం 9 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. మే నెలలో అయిదుగురు, జూన్ నెలలో నలుగురు బలవన్మరణానికి పాల్పడ్డారు.