భువనేశ్వర్ : ఒడిశా రాష్ట్రంలోని పూరి జిల్లా కోణార్క్లోని ప్రసిద్ధ సూర్యదేవాలయం తెరుచుకుంది. సోమవారం ఉదయం నుంచి ఆలయ దర్శనానికి భక్తులను అనుమతించారు. కరోనా ఉధృతి కారణంగా మూడు నెలలకుపైగా (100రోజులు) ఆలయం మూతపడింది. దీంతో ఆలయ దర్శనం కోసం భక్తులు సుధీర్ఘంగా వేచి ఉండాల్సి వచ్చింది. తొలిరోజు సుమారు 2 వేల మందికిపైగా భక్తులు ఆలయాన్ని సందర్శించినట్లు అధికారులు తెలిపారు. ఆలయ పరిసరాల్లో అధికారులు కొవిడ్ నిబంధనలు పక్కాగా అమలు చేశారు. థర్మల్ స్క్రీన్ నిర్వహించి, మాస్కులు ధరించిన వారినే ఆలయం లోపలికి అనుమతించారు. లోకల్ గౌడ్లను, ఫొటోగ్రాఫర్లను, చేతివృత్తి వ్యాపారులను ఆలయ పరిసరాల్లోకి అనుమతించ లేదు. ఆయా జిల్లాల్లోని కరోనా పరిస్థితులకు అనుగుణంగా మతపరమైన ప్రదేశాలు, పర్యాటక ప్రాంతాలను తెరుచుకునేందుకు వీలు కల్పిస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. పూరి జిల్లాలోని పూరి, కోణార్క్లోని చంద్రభాగ, బాలాసోర్ జిల్లాలోని ఛాందీపూర్ బీచుల్లోనూ పర్యాటకులకు ప్రభుత్వం అనుమతించింది. పూరి జిల్లాలోని పలు ప్రసిద్ధ ఆలయాలను రేపటి నుంచి తెరిచేందుకు ఆ జిల్లా అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తున్నది. జగన్నాథ స్వామి ఆలయాన్ని తెరిచే అంశంపై ఎల్లుండి సమీక్ష సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకుంటామని అధికారులు తెలిపారు.