న్యూఢిల్లీ: ఒలింపిక్స్ చరిత్రలో భారత ఆర్చర్లు మునుపెన్నడూ మెడల్ సాధించకపోయినా.. ఈసారి టోక్యోలో పతకం పక్కా అన్న ఆశలు మెండుగా ఉన్నాయి. ముఖ్యంగా గత నెల పారిస్ వేదికగా జరిగిన ఆర్చరీ ప్రపంచకప్ మూడో అంచెలో భారత స్టార్ దీపికా కుమారి ఒకేరోజు మూడుస్వర్ణాలతో అద్భుతం చేయడంతో అంచనాలు ఆకాశాన్నంటాయి. పురుషుల విభాగంలో దీపిక భర్త అతానూ దాస్ కూడా ఫామ్లో ఉన్నాడు. ప్రపంచకప్లో వీరిద్దరూ మిక్స్డ్ టీమ్ విభాగంలో స్వర్ణం సాధించగా.. ఒలింపిక్స్లోనూ ఈ స్టార్జోడీ ఇదే ఈవెంట్లో తలపడనుంది. పురుషుల వ్యక్తిగత రికర్వ్ విభాగంలో అతానుతో పాటు తరుణ్దీప్ రాయ్, ప్రవీణ్ జాదవ్ కూడా టోక్యోకు క్వాలిఫై అయ్యారు. పురుషుల టీమ్ విభాగంలోనూ వీరు జట్టుగా ఆడనున్నారు.
ఒలింపిక్స్లో మన ఆర్చర్లు: దీపికా కుమారి, అతాను దాస్, తరుణ్దీప్, ప్రవీణ్ జాదవ్