Lok Sabha Elections | న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఆరో విడుత ఎన్నికలకు పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 58 లోక్సభ నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతోంది. మొత్తం 889 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఈ దశలో మనోహర్ లాల్ ఖట్టర్, మెహబూబా ముఫ్తీ, ధర్మేంద్ర ప్రదాన్, సంబిత్ పాత్ర, మనేకా గాంధీ, దినేశ్ లాల్ యాదవ్, మనోజ్ తివారీ, కన్హయ్య కుమార్, రాజ్ బాబర్, నవీన్ జిందాల్ లాంటి ప్రముఖులు పోటీలో ఉన్నారు.
అయితే ఆరో దశలో అత్యంత ధనిక అభ్యర్థి ఎవరంటే.. ఏడీఆర్ నివేదిక ప్రకారం నవీన్ జిందాల్ అని తేలింది. నవీన్ జిందాల్ హర్యానాలోని కురుక్షేత్ర నియోజకవర్గం నుంచి బరిలో ఉన్నారు. ఆయన ఆస్తుల విలువ రూ. 1,241 కోట్లు అని అఫిడవిట్లో పేర్కొన్నారు. ఆ తర్వాత బీజేడీ అభ్యర్థి సంతృప్త్ మిశ్రా రూ. 482 కోట్లతో రెండో సంపన్నుడిగా నిలిచారు. ఆయన ఒడిశాలోని కటక్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. నవీన్ జిందాల్పై బరిలో దిగిన ఆప్ అభ్యర్థి సుశీల్ గుప్తా.. రూ. 169 కోట్లతో మూడో స్థానంలో ఉన్నారు.
హర్యానాలోని రోహతక్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాస్టర్ రణధీర్ సింగ్ అత్యంత నిరుపేద అభ్యర్థిగా నిలిచారు. ఆయన ఆస్తులు కేవలం రూ. 2 మాత్రమే. ఇదే విషయాన్ని ఆయన తన అఫిడవిట్లో వెల్లడించారు.