Hoyasala Temples | హోయసల రాజులు కర్ణాటకను క్రీస్తుశకం 10-14 శతాబ్దాల మధ్య పాలించారు. రాజధానులు బేలూర్, హళేబీడులో నిర్మించిన చెన్నకేశవ, హోయసలేశ్వర ఆలయాలు నాటి శిల్పకళా నైపుణ్యానికి గీటురాళ్లు. ఆలస్యంగా అయితేనేం.. ఈ రెండు ఆలయాలతోపాటు సోమనాథపురలోని కేశవస్వామి ఆలయానికి ఐక్యరాజ్య సమితి విద్యా వైజ్ఞానిక సాంస్కృతిక సంస్థ-యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాలుగా గుర్తింపు లభించింది.
కర్ణాటక రాష్ట్రం హసన్ నుంచి ఓ గంట ప్రయాణిస్తే బేలూర్ చేరుకోవచ్చు. ఇది ఒకప్పుడు హోయసలుల రాజధాని నగరం. ఇక్కడి చెన్నకేశవ ఆలయం సుప్రసిద్ధం. తమిళ చోళ రాజుల మీద విజయానికి గుర్తుగా 12వ శతాబ్దంలో హోయసల రాజు విష్ణువర్ధనుడు ఈ ఆలయ నిర్మాణం మొదలుపెట్టాడు. ఆ తర్వాత 103 ఏండ్లకు కానీ ఈ వాస్తుశిల్ప అద్భుతం పరిపూర్ణ ఆకృతిని దాల్చలేదు. తన తాత ప్రారంభించిన నిర్మాణాన్ని రెండో వీర
బళ్లాలుడు పూర్తిచేశాడు. నల్లసబ్బురాయితో (బ్లాక్ సోప్స్టోన్) దీన్ని నిర్మించారు. ఈ కోవెల నక్షత్రాకారపు వేదిక మీద కొలువుదీరి ఉంటుంది. ప్రాంగణం మధ్యలో ప్రధాన దైవం విష్ణుమూర్తి చెన్నకేశవుడిగా పూజలు అందుకుంటున్నాడు. వివిధ శిల్పాలతో కనువిందు చేసే గోపురాన్ని దాటగానే.. గర్భాలయానికి ఎదురుగా విష్ణువు వాహనమైన గరుత్మంతుడి విగ్రహం నమస్కార భంగిమలో ఉంటుంది. ఇక ఆలయ మండపం గోడలపై అంగుళం స్థలాన్ని కూడా వదిలిపెట్టకుండా మలిచిన చిన్నాపెద్దా శిల్పాలు ఆశ్చర్యపరుస్తాయి. ఏనుగులు, సింహాలు, యుద్ధ విన్యాసాలు, పౌరాణిక ఘట్టాలు, సంగీతకారులు, నృత్యకారులు, పుష్పాలు, లతలతో అల్లిన వివిధ రకాల అలంకార చిహ్నాలు, రామాయణ, మహాభారత ఇతివృత్తాలు వీటిలో ప్రముఖంగా కనిపిస్తాయి.
మైమరపించే మదనికలు
ఆలయ పైకప్పు, మండప స్తంభాలకు అనుసంధానంగా 38 మదనికల విగ్రహాలు ఉంటాయి. వీటిలో నానా రకాలైన ఆభరణాలతో.. చేతిలో అద్దం పట్టుకున్న దర్పణ సుందరి విగ్రహం ప్రత్యేక ఆకర్షణ. మండపాల లోపలి స్తంభాలూ ఎంతో ఆకట్టుకుంటాయి. నాటి శిల్పుల పనితనాన్ని తెలియజేస్తాయి. ప్రధాన దైవం చెన్నకేశవస్వామి విగ్రహం 6 అడుగుల ఎత్తు ఉంటుంది. స్వామి వెనక సునిశితంగా మలిచిన ప్రభావళి మనల్ని ఆనంద పరవశుల్ని చేస్తుంది.
అత్యద్భుతం… హోయసలేశ్వరం
బేలూర్ నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న హళేబీడులో హోయసలేశ్వర ఆలయం ఉంటుంది. ఇక్కడ ప్రధాన దైవం శివుడు. హళేబీడు అసలుపేరు ద్వారసముద్ర. ఇది హోయసల పాలకుల రెండో రాజధాని. 12వ శతాబ్ది నాటి హోయసలేశ్వర ఆలయం పరిసరాల్లో హిందూ, జైన దేవతల ఆలయాలు ఉన్నాయి. ఇది బేలూర్ చెన్నకేశవ ఆలయం కంటే పెద్దది. ఓ శతాబ్దకాలం పాటు నిర్మాణం జరిగినా ఇంకా అసంపూర్ణంగా మిగిలిపోయింది. రెండు నక్షత్రాకార వేదికల మీద నిర్మాణమైన హోయసలేశ్వర దేవాలయాన్ని భారతీయ శిల్పకళ సంప్రదాయ అత్యున్నత శైలికి ప్రతీక అని పేర్కొంటారు వాస్తు శాస్త్రజ్ఞులు. దేవతలు, రుషులు,
జంతువులు, హోయసల రాజుల కాలపు సామాజిక జీవితానికి సంబంధించిన అంశాలతో కూడిన శిల్పాలు ఈ ఆలయం అణువణువునా కనువిందు చేస్తుంటాయి. ప్రధాన ఆలయం గోడలను ఏనుగులు, సింహాలు, యుద్ధ సన్నివేశాలు, గుర్రాలు, కల్పిత మృగాలు, నెమళ్ల శిల్పాలతో అలంకరించారు. కాగా, చిన్నచిన్న వివరాలనూ వదిలిపెట్టకుండా చెక్కిన సంగీత, నాట్యకారుల శిల్పాలు అయస్కాంతంలా ఆకర్షిస్తాయి.
ఔరా! సోమనాథపుర
హోయసలుల కట్టడాల్లో మూడో ప్రసిద్ధ నిర్మాణం సోమనాథపురలోని చెన్నకేశవ మందిరం. ఈ ఆలయం బేలూర్, హళేబీడు పట్టణాలకు 200 కిలోమీటర్ల దూరంలో… మైసూరు నగరానికి దగ్గర్లో కావేరి ఒడ్డున ఉంది. 13వ శతాబ్దానికి చెందిన ఈ కట్టడాన్నిహోయసల సామంతుడు తన పేరుమీదుగా నిర్మించడం విశేషం. దీన్ని కూడా విష్ణుమూర్తికి అంకితమిచ్చారు. నిర్మాణం బేలూర్, హళేబీడు ఆలయాలను పోలి ఉంటుంది. గర్భాలయాల మీద మూడు విమానాలు ఉండటం సోమనాథపుర ఆలయం ప్రత్యేకత. ఆలయం పైకప్పులు ‘ఔరా!’ అనిపిస్తాయి. ప్రధాన ఆలయంలో కేశవస్వామి విగ్రహం ఇప్పుడు లేదు. కానీ పక్కనే ఉన్న ఆలయాల్లో శ్రీకృష్ణుడు, జనార్దన స్వామి మూర్తులు చూసేవారిని కట్టిపడేస్తాయి.
యునెస్కో పేర్కొన్నట్టు హోయసలులు నిర్మించిన ఈ మూడు ఆలయాలూ దక్షిణ భారత ఆలయ నిర్మాణశైలికి మచ్చుతునకలు. అంతకుముందు రాజుల కాలపు శైలి నుంచి స్ఫూర్తి పొందినా.. హోయసల శిల్పం సమకాలీన రాజ్యాల ఆలయాలకు విభిన్నమైనది. వీటి శిల్పాల్లో వాస్తవికత కంటే.. ఎక్కువ లక్షణాలు చూపించేలా శిల్పులు తమ కళను ప్రదర్శించారు. అలా రాజులు తమపైన పెట్టిన నమ్మకాన్ని నిలుపుకొన్నారు. అంతేకాదు ప్రదక్షిణ పథం, ఆలయ గోడలు, పైకప్పులు… ఇలా ఎక్కడా చోటు విడిచిపెట్టకుండా తమ శిల్పకళా పాటవాన్ని చాటిచెప్పడం విశేషం. హోయసల దేవాలయాలు హిందూ ఆలయ వాస్తుశిల్పం అభివృద్ధికి చారిత్రకంగా సజీవ సాక్ష్యాలని చెప్పడం అతిశయోక్తి కాదు. ఆలస్య మెందుకు, ప్రయాణానికి ఏర్పాట్లు చేసుకోండి.