న్యూఢిల్లీ, మే 18: దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు, కొలీజియం వ్యవస్థపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజుపై వేటుపడింది. న్యాయశాఖ బాధ్యతల నుంచి ఆయన్ను తప్పించి, కేంద్ర భూవిజ్ఞాన శాఖకు మార్చారు. కేంద్ర పార్లమెంటరీ సంబంధాలు, సాంస్కృతిక శాఖ కేంద్ర సహాయ మంత్రిగా పనిచేస్తున్న అర్జున్ రామ్ మేఘ్వాల్కు న్యాయశాఖ బాధ్యతల్ని అప్పగిస్తూ రాష్ట్రపతి భవన్ గురువారం ఉత్తర్వులు జారీచేసింది. న్యాయశాఖ సహాయ మంత్రిగా కొనసాగుతున్న ఎస్పీ సింగ్ భగెల్ను కూడా అక్కడ్నుంచి తప్పించి ఆరోగ్య శాఖకు మార్చింది. ప్రధాని మోదీ సలహా మేరకు మంత్రుల శాఖల్లో మార్పులు జరిగాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కేంద్ర మంత్రిత్వ శాఖల్లో హఠాత్తుగా చోటుచేసుకున్న మార్పు మీడియాలో చర్చనీయాంశమైంది. కేంద్ర న్యాయమంత్రిగా జూలై, 2021లో బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కిరణ్ రిజిజు తీరు వివాదాస్పదంగా మారింది. సుప్రీంకోర్టును లక్ష్యంగా చేసుకొని ఆయన చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపాయి.
న్యాయవ్యవస్థ స్వతంత్రతను దెబ్బతీసేలా అత్యంత దురుసుగా వ్యవహరించటం విమర్శలకు దారితీసింది. సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల ఎంపిక కొలీజియం వ్యవస్థ ద్వారా జరపటాన్ని మోదీ సర్కార్ మొదట్నుంచీ వ్యతిరేకిస్తూ వస్తున్నది. ఇందుకు అనుగుణంగానే కిరణ్ రిజిజు సుప్రీంకోర్టుపై మాటల దాడికి దిగారన్నది తెలిసిందే. న్యాయశాఖ మంత్రి పదవి నుంచి రవిశంకర్ ప్రసాద్ను తప్పించి కిరణ్ రిజిజును తీసుకొచ్చారు. ఇప్పుడు ఆయన స్థానంలో మేఘ్వాల్ను నియమిం చారు. నాలుగేండ్లలో ముగ్గురు న్యాయ శాఖ బాధ్యతలు చూడటం గమనార్హం. రిటైర్డ్ జడ్జీలంతా భారత్ వ్యతిరేక గ్యాంగ్గా ఏర్పడ్డారని రిజిజు తీవ్ర వ్యాఖ్య లు చేయడం.. దీనిపై కొంతమంది న్యాయవాదులు సుప్రీంకోర్టులో పిటిషన్ సైతం దాఖలు చేయడం తెలిసిందే.