భోపాల్: ఆదివాసీ యువకుడిపై మూత్ర విసర్జన ఘటన మరువకముందే, మధ్యప్రదేశ్లో మరో అమానుష ఘటన చోటుచేసుకుంది. గ్వాలియర్లో కొంతమంది ఓ వ్యక్తిని కిడ్నాప్ చేసి.. కారులో తీసుకెళ్తూ దాడికి తెగబడ్డారు. బాధితుడితో బలవంతంగా తమ పాదాల్ని నాకించి..వికృతంగా ప్రవర్తించారు. ఈ ఘటన శుక్రవారం గ్వాలియర్లో చోటుచేసుకుందని పోలీసులు వెల్లడించారు. దాడికి సంబంధించి ఇద్దరు నిందితుల్ని అరెస్టు చేశామని మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా చెప్పారు. దీనికి సంబంధించి వీడియో ప్రస్తుతం సోషల్మీడియాలో వైరల్గా మారింది.
బాధితుడు, నిందితులు గ్వాలియర్ జిల్లా దాబ్రా పట్టణానికి చెందినవారని తెలిసింది. కదులుతున్న కారులో కొంతమంది ఇష్టమున్నట్టు తిడుతూ, కొడుతూ, కాలి పాదాలు నాకరా..అంటూ బాధితుడిపై దాడికి తెగబడ్డారు. ఇదే కారులో మరొక వ్యక్తి బాధితుడి మొహంపై చెప్పుతో పదే పదే కొడుతున్న వీడియో క్లిప్ ఒకటి సోషల్ మీడియాలో విడుదలైంది. తాజా ఘటనపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతున్నది. దాబ్రా సబ్ డివిజనల్ పోలీస్ అధికారి వివేక్ కుమార్ శర్మ మాట్లాడుతూ, ‘వీడియో క్లిప్ను ఫొరెన్సిక్ పరీక్షలకు పంపాం. బాధితుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదుమేరకు నిందితులపై కేసులు నమోదుచేశాం’ అని చెప్పారు.
దళితుడి పెండ్లి బరాత్పై రాళ్లదాడి
షజాపూర్: మధ్యప్రదేశ్లోని షజాపూర్ జిల్లాలో దళితుడి పెండ్లి బరాత్పై ఓ గ్రామంలోని పెత్తందార్లు రాళ్లదాడికి దిగారు. దళిత యువకుడు అనిల్ చంద్ర పెండ్లి బారాత్…శుక్రవారం భాందెడి గ్రామం నుండి వెళ్తుండగా డీజే మ్యూజిక్ ఆపాలంటూ, కొంతమంది రాళ్లదాడికి దిగటం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. మరో ఘటనలో శివపూరి జిల్లా వర్ఖాడి గ్రామంలో ఒక వర్గానికి చెందిన కొంతమంది ఇద్దరు దళితులపై దాడిచేసి కొట్టారు. రేవా జిల్లాలో జూన్ 22న ఇంద్రజీత్ మాజీ అనే వ్యక్తి మెడలో చెప్పుల దండవేసి దాడి చేసిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. దొంగతనం చేశాడన్న అనుమానంతో మాజీని ముగ్గురు వ్యక్తులు దారుణంగా కొట్టా రు. ఈ ఘటనలో నిందితులైన ముగ్గు ర్ని పోలీసులు అరెస్టు చేశారు. ఈనేపథ్యంలో దళితులు, ఆదివాసీలపై దాడు ల్ని బీజేపీ సర్కార్ అరికట్టలేక పోతున్నదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.