చండీగఢ్, ఆగస్టు 30: హర్యానా సీఎం మనోహర్లాల్ ఖట్టర్, పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ మాటల యుద్ధానికి దిగారు. హర్యానాలో రైతుల ఆందోళన వెనుక అమరీందర్ హస్తం ఉందని ఖట్టర్ ఆరోపించగా… ఖట్టర్ రైతు వ్యతిరేకి అని అమరీందర్ ధ్వజమెత్తారు. శనివారం హర్యానాలో నిరసన తెలిపేందుకు కర్నాల్ వెళుతున్న రైతులపై పోలీసులు లాఠీచార్జి చేశారు. దాంతో పలువురు రైతులు గాయపడ్డారు. ఈ నేపథ్యంలో ఖట్టర్, అమరీందర్ పరస్పర ఆరోపణలు చేసుకున్నారు. మాజీ సీఎం భూపీందర్ సింగ్ హుడా, మరికొందరు కాంగ్రెస్, వామపక్షాల నాయకులు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకునేలా హర్యానాలో రైతులను రెచ్చగొడుతున్నారని ఖట్టర్ ఆరోపించారు. రైతుల తలలు పగులకొట్టండని పోలీసులను ఆదేశిస్తూ వీడియోలకు చిక్కిన ఐఏఎస్ అధికారి కర్నాల్ ఎస్డీఎం ఆయుష్ సింగ్ వాడిన పదాలు సరైనవి కాదంటూనే పోలీసుల చర్యను విలేకరుల సమావేశంలో ఖట్టర్ సమర్థించారు. దీనికి అమరీందర్ స్పందిస్తూ ఖట్టర్ రైతు వ్యతిరేక ఎజెండా బయటపడిందని విమర్శించారు. రైతులు తమ మనుగడ కోసం పోరాడుతున్నారని, వారిని పంజాబ్ రెచ్చగొట్టాల్సిన అవసరం లేదన్నారు. రైతుల గోసను ఖట్టర్ పట్టించుకుని ఉంటే సంక్షోభం ఇంత తీవ్రరూపం దాల్చేది కాదన్నారు. కేంద్రంలోని బీజేపీ నాయకత్వం తమ సొంత ప్రయోజనాల కోసం కొత్త సాగు చట్టాలను రద్దు చేయకుండా మూర్ఖంగా వ్యవహరిస్తున్నదని విమర్శించారు. బీజేపీ తన ఆశ్రిత పెట్టుబడిదారులను సామాన్యుల నెత్తిపై కూర్చోబెడుతున్నదని మండిపడ్డారు.