Karge Clarity | తన పేరును కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీ సూచించినట్లు వస్తున్న వార్తలన్నీ వదంతులే అని కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి మల్లికార్జున్ ఖర్గే కొట్టి పారేశారు. తన పేరును సోనియా సూచించలేదని ఆయన స్పష్టం చేశారు. పార్టీ అధ్యక్ష పదవికి తన పేరును సోనియాతో సహా ఎవ్వరూ ఎప్పుడూ సూచించలేదని, అది కేవలం పుకారే అని ఖర్గే అన్నారు. కాంగ్రెస్ అధ్యక్ష పదవి రేసులో శశి థరూర్, మల్లికార్జున్ ఖర్గే పోటీ పడుతున్నారు.
కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి సోనియా గాంధీ తన పేరును సూచించడం అవాస్తవమని, నేనెప్పుడూ ఇలా చెప్పుకోలేదన్నారు మల్లికార్జున్ ఖర్గే చెప్పారు. గాంధీ కుటుంబం నుంచి ఎవరూ ఎన్నికల్లో పాల్గొనరని, ఏ అభ్యర్థికి తమ మద్దతు ఉండదని సోనియ స్పష్టంగా చెప్పారన్నారు. కాంగ్రెస్ పార్టీని, సోనియా గాంధీని, తనను కించపరిచేందుకే ఎవరో ఈ పుకారు వ్యాప్తి చేస్తున్నట్లు అభిప్రాయపడ్డారు.
పార్టీ నుంచి ఎన్నికైన 9,300 మంది డెలిగేట్లు పార్టీ జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకోనున్నారు. ఒక్క ఉత్తరప్రదేశ్లోనే 1,250 మంది డెలిగేట్లు ఉన్నారు. అధ్యక్ష ఎన్నిక రేసు నుంచి దిగ్విజయ్ సింగ్ తప్పుకోవడంతో.. శశి థరూర్, మల్లికార్జున్ ఖర్గే బరిలో నిలిచారు. ఎన్నిక ఈ నెల 17 న జరుగుతాయి. 19 న ఫలితం ప్రకటిస్తారు.