 
                                                            Mallikarjun Kharge : అధికార బీజేపీ (BJP), దాని మాతృసంస్థ ఆరెస్సెస్ (RSS) పై కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge) తీవ్ర విమర్శలు గుప్పించారు. దేశంలో ఎక్కువగా శాంతిభద్రతల సమస్యలు తలెత్తడానికి బీజేపీ-ఆరెస్సెస్ కారణమని ఆరోపించారు. ఈ క్రమంలో ఆరెస్సెస్ను నిషేధించాలన్నది తన వ్యక్తిగత అభిప్రాయమని చెప్పారు.
సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీపై ప్రధాని నరేంద్ర మోదీ చేసిన విమర్శలను ఖర్గే తిప్పికొట్టారు. 1948లో మహాత్మాగాంధీ హత్య తర్వాత ఆరెస్సెస్ను విమర్శిస్తూ పటేల్ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ చీఫ్ ఉదహరించారు. ఉక్కు మనిషి సర్దార్ పటేల్, ఉక్కు మహిళ ఇందిరాగాంధీ గొప్ప నేతలని ఖర్గే పేర్కొన్నారు. వారు దేశానికి ఎంతో సేవ చేశారని, దేశ ఐక్యతను కాపాడేందుకు ఎంతో కృషి చేశారని కొనియాడారు.
ఆరెస్సెస్ను నిషేధించాలన్న వ్యాఖ్యలపై అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ.. అది తన వ్యక్తిగత అభిప్రాయమన్నారు. మహాత్మాగాంధీ హత్యకు దారితీసిన వాతావరణాన్ని ఆరెస్సెస్ సృష్టించిందని మండిపడ్డారు. ఇదే విషయాన్ని పేర్కొంటూ నాటి హోంమంత్రి పటేల్.. శ్యామప్రసాద్ ముఖర్జీకి లేఖ రాశారని గుర్తుచేశారు. భారత తొలి ప్రధాని నెహ్రూ, సర్దార్ పటేల్ల మధ్య గొప్ప సంబంధాలు ఉన్నప్పటికీ.. వారి మధ్య చీలిక తెచ్చేందుకు నిత్యం ప్రయత్నించేవారని దుయ్యబట్టారు.
దేశ ఐక్యతకు ప్రతీకగా నిలిచిన పటేల్ను నెహ్రూ ప్రశంసించారని, పటేల్ కూడా నెహ్రూను దేశానికి ఆదర్శంగా అభివర్ణించారని పేర్కొన్నారు. కశ్మీర్ మొత్తాన్ని దేశంలో కలపాలని పటేల్ కోరుకున్నారని, కానీ నాటి ప్రధాని నెహ్రూ ఆ ప్రయత్నాలను సాగనివ్వలేదని ప్రధాని మోదీ ఆరోపించడంపై ఖర్గే తీవ్రంగా మండిపడ్డారు. అయితే ఖర్గే వ్యాఖ్యలపై బీజేపీ స్పందించింది. దశాబ్దాలపాటు పటేల్ చేసిన సేవలను కాంగ్రెస్ విస్మరించిందని పేర్కొన్నది.
 
                            