న్యూఢిల్లీ, డిసెంబర్ 22: కెనడా కేంద్రంగా భారత్పై తీవ్ర ద్వేషం వెళ్లగక్కుతున్న ‘సిక్స్ ఫర్ జస్టిస్’ అధినేత, ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్ పన్నూ మరింత ప్రమాదకరంగా మారాడు. తాజాగా అతడు కశ్మీర్ ఉగ్రవాదులతో చేతులు కలిపి కొత్త సంస్థను ఏర్పాటు చేశాడు. ఆ విషయాన్ని పన్నూయే స్వయంగా ప్రకటించాడు. ‘కశ్మీర్-ఖలిస్థాన్ రెఫరెండం ఫ్రంట్’ అధికార ప్రతినిధిగా తనను తాను ప్రకటించుకొన్నాడు. ఇక నుంచి భారత సైన్యంపై భీకర దాడులు చేస్తామని హెచ్చరించాడు.
‘భారత సైన్యం దశాబ్దాలుగా మారణహోమం సృష్టిస్తున్న భారత ఆక్రమిత కశ్మీర్ అంతర్జాతీయ వివాదంగా మారిన ప్రాంతం. భారత సైన్యం దశాబ్దాలుగా చేసిన హింసకు ఇప్పుడు కశ్మీర్ స్వాతంత్య్ర సమరయోధుల చేతుల్లో మరణిస్తూ ఫలితం అనుభవిస్తున్నది. హింస ఎప్పుడూ హింసనే పుట్టిస్తుంది’ అని ఓ ప్రకటన విడుదల చేశాడు. గురువారం కశ్మీర్లోని రాజౌరీ జిల్లాలో ఉగ్రవాదులు జరిపిన దాడిలో ఐదుగురు సైనికులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనను ఉదాహరణగా చూపుతూ పన్నూ ఈ ప్రకటన విడుదల చేశాడు. ‘భారత యూనియన్లో పంజాబ్ను విలీనం చేయటాన్ని ఎస్ఎఫ్జే ఎలా సవాల్చేస్తూ ప్రజాభిప్రాయ సేకరణకు డిమాండ్ చేస్తున్నదో.. కశ్మీర్ కోసం కూడా కశ్మీరీ పోరాటయోధులు డిమాండ్ చేయండి’ అని పిలుపునిచ్చాడు. పన్నూను కేంద్ర హోంశాఖ 2020, జూలై 1న ఉగ్రవాదిగా ప్రకటించింది. ఏడాది తర్వాత అతడి సంస్థ ఎస్ఎఫ్జేను నిషేధించింది.