India vs Canada | న్యూఢిల్లీ, సెప్టెంబర్ 19: జీ-20 సదస్సు వేదికగా భారత్-కెనడా మధ్య రాజుకొన్న విభేదాలు తీవ్రస్థాయికి చేరాయి. కెనడాలో ఖలిస్థానీ ఆందోళనల విషయంలో రెండు దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి. ఖలిస్థానీ ఉగ్రవాది, ఖలిస్థాన్ టైగర్ ఫోర్స్(కేటీఎఫ్) కీలక నేత హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య విషయంలో ఖలిస్థానీ ఉద్యమంపై పక్షపాత ధోరణితో వ్యవహరించే కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో వ్యాఖ్యలు మరింత చిచ్చు రాజేశాయి. నిజ్జర్ను భారత ప్రభుత్వమే హత్య చేయించిందని, ఈ మేరకు తనకు విశ్వసనీయ సమాచారం ఉన్నదని ఆరోపణలు చేశారు. నిజ్జర్ హత్యలో భారత్ ఏజెంట్ల ప్రమేయం ఉన్నదని, కెనడియన్ ప్రభుత్వ ఏజెన్సీలు ఈ హత్యపై దర్యాప్తు చేస్తున్నాయని వ్యాఖ్యానించారు. సోమవారం ఆ దేశ పార్లమెంట్లో ట్రూడో మాట్లాడుతూ నిజ్జర్ హత్య అంశాన్ని జీ20 సమావేశాల సందర్భంగా భారత ప్రధాని మోదీతో కూడా చర్చించానని పేర్కొన్నారు. తమ దేశంలో తమ దేశ పౌరుడి హత్యలో విదేశీ ప్రభుత్వ హస్తం ఆమోదనీయం కాదని, కెనడా సార్వభౌమాధికారాన్ని ఉల్లఘించినట్టేనని ట్రూడో అన్నారు. ఆరోపణలతో ఆగకుండా ట్రూడో వ్యాఖ్యల అనంతరం ఆ దేశ ప్రభుత్వం అక్కడి భారత దౌత్యవేత్తను బహిష్కరించింది. కెనడాలోని భారత దౌత్య కార్యాలయానికి చెందిన ఇంటెలిజెన్స్ విభాగం అధిపతి పవన్ కుమార్ రాయ్ను బహిష్కరించినట్టు విదేశాంగ మంత్రి మెలనీ జాలీ తెలిపారు.
5 రోజుల్లో దేశాన్ని వీడాలి!
కెనడాలో భారత్కు వ్యతిరేకంగా ఖలిస్థానీల ఆందోళనలు పెద్దయెత్తున సాగుతున్న విషయం తెలిసిందే. అయితే వీటిపై ట్రూడో ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తున్నదనే ఆరోపణలు ఉ న్నాయి. తాజాగా నిజ్జర్ హత్యపై కెనడా ప్రధాని ట్రూడో ఆరోపణలు, భారత దౌత్యవేత్త బహిష్కరణపై భారత్ తీవ్రంగా స్పందించింది. ప్రతి చర్యగా భారత్లోని కెనడా సీనియర్ దౌత్యవేత్త ఒలివియర్ సిల్వెస్టర్ను భారత ప్రభుత్వం మంగళవారం బహిష్కరించింది. ఐదు రోజుల్లోగా దేశాన్ని విడిచిపోవాలని ఆదేశించింది. కెనడా దౌత్యవేత్త బహిష్కరణపై సమాచారం ఇచ్చేందుకు భారత విదేశాంగ శాఖ కెనడా హైకమిషనర్కు సమన్లు ఇచ్చింది.
ఖలిస్థానీలకు కెనడా ఆశ్రయం
నిజ్జర్ హత్యపై కెనడా ప్రధాని వ్యాఖ్యలను భారత ప్రభుత్వం ఖండించింది. అవి పూర్తిగా అసంబద్ధమైనవని, ప్రేరేపిత ఆరోపణలు అని భారత విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో పేర్కొన్నది. కెనడా ఆశ్రయం పొందుతూ, భారత సార్వభౌమాధికారం ప్రాదేశిక సమ్రగతకు ముప్పుగా మారిన ఖలిస్థాన్ ఉగ్రవాదులపై నుంచి దృష్టి మరల్చే యత్నంలో భాగంగా నిరాధార ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నది. సుదీర్ఘంగా నెలకొన్న ఈ ఖలిస్థానీ వివాదంపై కెనడా ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం ఆందోళనకరమని పేర్కొన్నది. కెనడాలో హత్యలు, మానవ అక్రమ రవాణా, వ్యవస్థీకృత నేరాలతో సహా పలు చట్ట వ్యతిరేక కార్యకలాపాలు కొత్తేం కాదని, అటువంటి వాటిని భారత ప్రభుత్వానికి ముడిపెడదామని చేసే ప్రయత్నాలను సహించేది లేదని స్పష్టం చేసింది. కెనడాలో కార్యకలాపాలు నడుపుతున్న భారత వ్యతిరేక శక్తులపై న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని మరోసారి కోరుతున్నామని భారత విదేశాంగ శాఖ ప్రకటనలో పేర్కొన్నది. కాగా, ట్రూడో వ్యాఖ్యలపై అమెరికా, యూకే, ఆస్ట్రేలియా తదితర దేశాలు స్పందించాయి. ఆరోపణలపై ఆందోళన వ్యక్తం చేశాయి. భారత్, కెనడా మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు.. ఇరు దేశాల వాణిజ్య సంబంధాలపై ప్రభావం చూపే అవకాశం ఉన్నదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఎవరీ నిజ్జర్?
ఈ ఏడాది జూన్ 18న హర్దీప్ సింగ్ నిజ్జర్(45) కెనడాలో హత్యకు గురయ్యాడు. బ్రిటీష్ కొలంబియాలోని సర్రే ప్రాంతంలో ఓ గురుద్వారా సాహిబ్ ప్రాంగణంలో గుర్తుతెలియని వ్యక్తులు అతన్ని కాల్చిచంపారు. పంజాబ్లోని జలంధర్ జిల్లాకు చెందిన నిజ్జర్ 1997లో కెనడాకు వలస వెళ్లాడు. ఆ తర్వాత నిషేధిత ఉగ్రవాద సంస్థ ఖలిస్థాన్ టైగర్ ఫొర్స్(కేటీఎఫ్) కీలక నేతగా ఎదిగాడు. నిషేధిత వేర్పాటువాద సంస్థ సిఖ్స్ ఫర్ జస్టిస్(ఎస్ఎఫ్జే)తో కూడా సంబంధాలు ఉన్నాయి. భారత ప్రభుత్వం నిజ్జర్ను 2020లో ఉగ్రవాదిగా ప్రకటించింది. పంజాబ్లోని లూధియానాలో 2007లో జరిగిన బాంబు పేలుడు కేసుతోపాటు పలు కేసుల్లో నిజ్జర్ మోస్ట్ వాంటెడ్గా ఉన్నాడు. ఓ హత్య కేసులో గత ఏడాది జూలైలో ఎన్ఐఏ అతనిపై రూ.10 లక్షల రివార్డు కూడా ప్రకటించింది.