తిరువనంతపురం: చెట్టు నుంచి మామిడి కాయలు కోసినందుకు పొరుగిళ్లకు చెందిన ముగ్గురు యువతులపై కొందరు వ్యక్తులు కత్తులతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన ఆ ముగ్గురు అమ్మాయిలు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కేరళలోని అలప్పుజా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. కాయంకుళంలోని కీరికోడ్ ప్రాంతానికి చెందిన 40 ఏళ్ల జయేష్ అలియాస్ బిజు ఇంటి ఆవరణలో మామిడి చెట్టు ఉంది. అయితే పొరుగింటికి చెందిన అక్కాచెల్లెళ్లైన స్మిత, మినీ ఆ చెట్టు నుంచి మామిడి కాయలు కోశారు. ఈ విషయం తెలిసిన బిజు మరో ఇద్దరితో కలిసి మంగళవారం రాత్రి ఆ యువతులపై కత్తులతో దాడి చేశాడు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన మరో పొరుగింటి యువతి నీతును కూడా కొట్టి గాయపరిచాడు. అనంతరం వారంతా అక్కడి నుంచి పారిపోయారు.
మరోవైపు తీవ్రంగా గాయపడిన ముగ్గురు యువతులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు ప్రధాన నిందితుడు బిజును శుక్రవారం అరెస్ట్ చేశారు. మరో ఇద్దరు నిందితుల కోసం వెతుకుతున్నారు.
కాగా, ఓనమ్ సందర్భంగా బిజు పొరుగింటి ముందు క్రాకర్స్ కాల్చాడు. దీనిపై వారు అభ్యంతరం వ్యక్తం చేయగా వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో ఆ కుటుంబంపై బిజు కక్ష పెంచుకున్నాడని పోలీసులు తెలిపారు. అతడి ఇంటి ఆవరణలో ఉన్న మామిడి చెట్టు కాయలను పొరుగింటి అమ్మాయిలు కోయడంపై ఆగ్రహం చెందిన అతడు మరో ఇద్దరితో కలిసి కత్తులతో దాడి చేసినట్లు చెప్పారు.