తిరువనంతపురం: కేరళలో కొత్తగా 59 ఒమిక్రాన్ కేసులు గురువారం నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో కొత్త వేరియంట్ కేసుల మొత్తం సంఖ్య 480కి పెరిగింది. తాజాగా నమోదైన 59 కేసుల్లో అలప్పుజా జిల్లా నుంచి 12, త్రిసూర్ నుంచి 10, పతనంతిట్ట నుంచి 8, ఎర్నాకులం నుంచి 7, కొల్లాం, మలప్పురం నుంచి 6, కోజికోడ్ నుంచి 5, పాలక్కాడ్, కాసరగోడ్ నుంచి 2, కన్నూర్ నుంచి ఒకటి చొప్పున ఒమిక్రాన్ కేసులు నమోదైనట్లు ఆ రాష్ట్ర వైద్య అధికారులు తెలిపారు.
కాగా, కొత్త ఒమిక్రాన్ కేసుల్లో 42 మంది తక్కువ ప్రమాదం ఉన్న దేశాల నుంచి, 5 మంది హై రిస్క్ దేశాల నుండి వచ్చారని అధికారులు చెప్పారు. 33 మంది యూఏఈ, 6 మంది ఖతార్, ఇద్దరు అమెరికా, టర్కీ, ఇజ్రాయెల్, కజకిస్తాన్, ఉక్రెయిన్, సౌదీ అరేబియా, జర్మనీ నుంచి ఒక్కొక్కరు చొప్పున కేరళకు వచ్చినట్లు వెల్లడించారు.
59 కొత్త ఒమిక్రాన్ కేసుల్లో 9 మందికి పరిచయస్తుల ద్వారా ఒమిక్రాన్ సోకిందని అధికారులు తెలిపారు. త్రిసూర్లో సోకిన 10 మందిలో ముగ్గురు ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన వారని చెప్పారు. దీంతో రాష్ట్రంలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 480కి పెరిగిందన్నారు.