తిరువనంతపురం: దేశమంతటా కరోనా మహమ్మారి ( Covid-19 ) ప్రభావం క్రమంగా తగ్గుతున్నది. కానీ కేరళలో మాత్రం మహమ్మారి మరింత విజృంభిస్తున్నది. గత వారం రోజులుగా అక్కడ ప్రతిరోజూ నమోదవుతున్న కొత్త పాజిటివ్ కేసుల సంఖ్య 30 వేల దరిదాపుల్లో ఉంటూ వచ్చింది. అయితే, ఉన్నట్టుండి మంగళవారం కొత్త కేసుల సంఖ్య 19 వేలకు పడిపోయింది. హమ్మయ్య కేరళలో కూడా మహమ్మారి ప్రభావం తగ్గింది అనుకుంటుండగానే ఇవాళ అక్కడ మళ్లీ 30 వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి.
ఇవాళ ఒక్కరోజే కొత్తగా 32,803 మందికి కరోనా పాజిటివ్ రావడంతో మొత్తం కేసుల సంఖ్య 38,38,614కు చేరింది. ఇక కొత్తగా ఇవాళ 173 మంది కరోనా బాధితులు మరణించడంతో ఆ రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 20,961కి చేరింది. అక్కడ ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసులలో కరోనా మరణాలు, రికవరీలు పోగా ప్రస్తుతం 2,29,912 యాక్టివ్ కేసులు ఉన్నాయి.